సిటీబ్యూరో, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ) : ముంచుకొచ్చే ఆర్థిక ఇబ్బందులు, పొంచి ఉన్న అనారోగ్య సమస్యల ఛట్రంలో ఇరుక్కుపోకుండా ఉంటే చాలనే ధోరణి అత్యంత ప్రాధాన్యతగా మారుతుంది. ఇదే విషయాన్ని హ్యూమన్ బిహేవీయర్, హెల్త్, వెల్త్, కస్టమర్ బిహేవియర్పై అధ్యయనం చేసే అమెక్స్ ట్రెండెక్స్ సంస్థ సర్వేలో తేలింది. అమెరికన్ ఎక్స్ప్రెస్ ఆధ్వర్యంలో అమెక్స్ ట్రెండెక్స్ పేరిట సర్వే ఫలితాలను వెల్లడించింది. ఈ అధ్యయనం కోసం భారత్తోపాటు, ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, మెక్సికో, యూకే, యూఎస్ వంటి దేశాల్లో వయోజనులను ప్రామాణికంగా తీసుకుని మానసిక ధోరణులను సేకరించారు. మెట్రో నగరాల్లో ఉండే నివాసితులు 85శాతం మంది కొత్త ఏడాది రెజుల్యూషన్లో 76శాతం మంది ఫిజికల్ వెల్నెస్, 69శాతం మంది పర్సనల్ ఫైనాన్స్లపై దృష్టి సారించినట్లుగా తేలింది.
అదేవిధంగా 80శాతం మంది కొత్త ఏడాదిలో తీసుకున్న నిర్ణయాలను సమర్థవంతంగా పాటించాల్సిన ప్రణాళికలు చేసుకోగా, 73శాతం మంది ఆరోగ్యానిచ్చే ఆహారంపై ప్రాధాన్యతను గుర్తించారు. ఇక 80శాతం భారతీయులు ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని కోరుకుంటున్నారు. అదేవిధంగా గతేడాది కంటే 61శాతం మంది ఎక్కువగా క్రీడా పోటీలకు హాజరు కావాలని కోరుకున్నారు. దేశంలో ఎక్కడ క్రీడా పోటీలు జరిగిన వెళ్లేందుకు సంసిద్ధమేనని 97శాతం వ్యాఖ్యానించారు. ముఖ్యంగా భవిష్యత్తుకు భరోసానిచ్చేలా వ్యక్తిగత ఆర్థిక పరిపక్వత పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెల్లడైంది.