సిటీబ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్కు అదనపు డీజీపీ నుంచి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ర్యాంక్ పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1991వ బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఏర్పాటైన తర్వాత పలు కీలకమైన బాధ్యతలు నిర్వర్తించి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న సమయంలో వరంగల్, అదిలాబాద్ తదితర ప్రాంతాలలో సేవలందించారు. ఐపీఎస్ అధికారి ఆనంద్ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2000లో రాష్ట్రపతి పోలీస్ మెడల్ను అందించింది.
హైదరాబాద్ సెంట్రల్ జోన్ ఏర్పాటు కావడంతో ఆయన మొదటిసారి డీసీపీగా బాధ్యతలు చేపట్టారు. అలాగే, ఉమ్మడి ఏపీలో విజయవాడ కమిషనర్గా, సీఐడీ, ఎక్సైజ్ శాఖలలోనూ పనిచేశారు. హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్గా, ఆ తర్వాత సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా పనిచేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ట్రాఫిక్ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు చేపట్టి సత్ఫలితాలు సాధించారు. పదకొండున్నర సంవత్సరాలు మెట్రోపాలిటన్ అర్బన్ పోలీసింగ్లో వివిధ హోదాలలో ఆనంద్ బాధ్యతలు నిర్వర్తించారు. సైబరాబాద్ కమిషనర్గా పనిచేసిన సమయంలో 2014లో జరిగిన సాధారణ ఎన్నికలను ఉత్తమంగా నిర్వహించారని భారత ఎన్నికల కమిషన్ గుర్తించి జాతీయ అవార్డును అందించింది.
తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఆనంద్ సేవలను గుర్తించిన ప్రభుత్వం సివిల్ సైప్లె హెడ్గా మొదటి సారిగా ఐపీఎస్ అధికారిని నియమించింది. డిప్యూటేషన్పై కేంద్ర సర్వీస్లకు వెళ్లి నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ (ఎన్ఐఎస్ఏ) డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన సేవలకు పలు అవార్డులు, రివార్డులు, పతకాలు వచ్చాయి. 2021లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టి డ్రగ్స్, సైబర్ నేరాలను అణిచివేయడంలో ప్రత్యేక చొరవ చూపుతూ ట్రాఫిక్ విషయంలో ఇబ్బందులు లేకుండా రోప్ వంటి పలు సంస్కరణలు చేపట్టారు. ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ కమిషనర్తో పాటు తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో (టీన్యాబ్) డైరెక్టర్గా ఆనంద్ కొనసాగుతూ.. అదనపు డీజీపీ ర్యాంక్ నుంచి డీజీపీ ర్యాంక్కు పదోన్నతి పొందారు.