హైదరాబాద్ : పోలీసులు ప్రతి చోటా భౌతికంగా ఉండలేరు.. అందుకే రాష్ట్రంలో బలంగా ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలను కూడా సమాజ భద్రతలో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించాం అని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి డీజీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన జూమ్ సమావేశంలో ఆయన మాట్లాడారు… రాష్ట్రంలో మహిళలు, పిల్లల భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. దేశంలో తొలిసారిగా అడిషనల్ డీజీ నేతృత్వంలో మహిళా భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణ రాష్ర్టానికే దక్కిందని గుర్తు చేశారు. మహిళల భద్రత చర్యల్లో భాగంగా షీటీమ్లు, భరోసా కేంద్రాలు, ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటుతోపాటు డయల్ 100 , 112ల ద్వారా అందే ఫిర్యాదులకు సత్వరం స్పందిస్తున్నట్టు తెలిపారు. సీసీ టీవీల ఏర్పాటులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, అదేవిధంగా స్థానిక ప్రజల సహాయ, సహాకారాలతో హైదరాబాద్ నగరంలో 6.50 లక్షల సీసీ టీవీలను ఏర్పాటు చేశామన్నారు.
షీ టీమ్కు 2020లో అందిన మొత్తం ఐదువేల ఫిర్యాదుల్లో వాట్సాప్ ద్వారానే 68 శాతం అందాయని మహి ళా భద్రతా విభాగం ఇన్చార్జి, అడిషనల్ డీజీ స్వాతి లక్రా వెల్లడించారు. షీటీం పనితీరుపై ప్రముఖ సంస్థ సెస్ సర్వే నిర్వహించగా 89 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. అనంతరం డీఐజీ సుమతి మాట్లాడుతూ.. రాష్ట్ర పోలీస్శాఖలో మహిళా భద్రతా విభాగం ఏర్పాటయ్యి మూడేండ్లయిందని, ఈ మూడేండ్లలో మహిళా భద్రత కోసం పలు కార్యక్రమాలు చేపట్టామన్నా రు. అనంతరం మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 1.7 లక్షల మహిళా బృందాల్లో 17 లక్షల మహిళలు సభ్యులుగా ఉన్నారని.. వీరందరికీ గృహ హింస, వర్క్ ప్లేస్ హరాస్మెంట్, ఇతర సామాజిక సమస్యలపై చైతన్యంకల్పించడం హర్షణీయమన్నారు.
అనంతరం క్యూ ఆర్ కోడ్తో ఫిర్యాదు, కౌమార బాలికలపై జరిగే సైబర్ క్రైమ్స్ నిరోధం పోస్టర్లు, మహిళా భద్రతా విభాగం విధి విధానాలపై ప్రచురించిన పుస్తకాలను డీజీపీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో రక్షిత్ తాండాన్, గీతా చల్ల, శృతి ఉపాధ్యాయ్ , మెప్మా మిషన్ డైరెక్టర్ పద్మ, విద్యార్థినీ, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళా భద్రతా విభాగాల అధికారులు పాల్గొన్నారు.