Bandla Ganesh | బంజారాహిల్స్, ఫిబ్రవరి 17: అద్దెకు తీసుకున్న ఇంటిని కాజేసేందుకు సినీ నిర్మాత, కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేశ్ ప్రయత్నించడంతో పాటు తనపై తప్పుడు కేసు పెట్టాడని హీరా గ్రూప్ అధినేత నౌహీరా షేక్ ఆరోపించారు. బంజారాహిల్స్ రోడ్ నం.10లోని హీరా గ్రూప్ సంస్థ ప్రధాన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నౌహీరా షేక్ మాట్లాడుతూ.. ఫిలింనగర్ సైట్-2లో ఉన్న సుమారు రూ.75కోట్ల విలువైన ఇంట్లోని మొదటి ఫ్లోర్ను బండ్ల గణేశ్కు 2021 జూన్ 5న అద్దెకు ఇచ్చామని, 11నెలలు రెంటల్ అగ్రిమెంట్ కూడా చేశామని తెలిపారు.
గడువు ముగిసిన తర్వాత కూడా తన ఇంటిని ఖాళీ చేయకపోగా, ఈడీ అధికారులు ఇంటిని అటాచ్ చేశారని తెలుసుకున్న బండ్ల గణేశ్.. అడ్డదారిలో ఇల్లు మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకుని వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. 11 నెలలు చేసిన రెంటల్ అగ్రిమెంట్ను ఫోర్జరీ చేసి 9 ఏండ్లు అద్దెకు తీసుకున్నట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించాడని, తక్కువ ధరకు ఇంటిని అమ్మాలంటూ ఒత్తిడి తీసుకువస్తున్నారని అన్నారు.
ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలుసుకుని అక్కడకు వెళ్లిన తనపై రౌడీల సాయంతో దౌర్జన్యానికి దిగడంతో పాటు ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. ఇంటిని ఆక్రమించుకున్న బండ్ల గణేశ్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే.. పోలీసులు ఆయనకే వత్తాసు పలకడం బాధాకరమన్నారు. ఫిలింనగర్ పోలీసుల వైఖరిపై తాను డీజీపీకి ఫిర్యాదు చేశానని, సోమవారం నగర పోలీస్కమిషనర్ను కలువనున్నట్లు తెలిపారు.