సికింద్రాబాద్, మే 6 : పేదల ప్రజలకు అన్ని వేళలా అండగా ఉంటామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. సీతాఫల్మండిలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం కరోనాతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నవారికి ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత సంవత్సరం కరోనా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వందలాది మందికి ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేశామన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో నివాసం ఉండేవారికి తనవంతు ప్రయత్నంగా కరోనా బాధితుల ప్రాణాలు కాపాడడానికి కృషి చేస్తున్నానని తెలిపారు. కరోనా బాధితులు అర్ధరాత్రి కూడా ఆక్సిజన్ సిలిండర్ల కోసం వస్తున్నారని, ఇందుకోసం తమ ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని ఆయన తెలిపారు.
కేవలం ఉచితంగా ఇవ్వడం కోసమే సిలిండర్లను కొనుగోలు చేసి సిద్ధంగా పెట్టామని, గత సంవత్సరం నుంచే ఆక్సిజన్ నింపేవారితో ఒప్పందం పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఆక్సిజన్ కొరత సమస్యలు రావడం లేదని తెలిపారు. నియోజకవర్గానికి చెందినవారు ఎవరైనా ఆక్సిజన్ సిలిండర్ల కోసం తమను సంప్రదించాలని కోరారు. అవసరం తీరిన తర్వాత ఆక్సిజన్ సిలిండర్లను తిరిగి తీసుకొచ్చి ఇస్తే.. ఇతర బాధితులకు ఇస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో శేఖర్, బొగ్గుల కృష్ణ, బాలాజీ ఇతర నేతలు పాల్గొన్నారు.