సికింద్రాబాద్, సెప్టెంబర్ 12 : ఏ పార్టీకీ సాధ్యం కాని రీతిలో టీఆర్ఎస్లో సంస్థాగత నిర్మాణం పకడ్బందీగా కొనసాగించేందుకు కసరత్తు ప్రారంభమైంది. కమిటీల ఏర్పాటులో స్వేచ్ఛాయుత వాతావరణంలో అందరి అభిప్రాయాలతో సమష్టి నిర్ణయాలకే పెద్దపీట వేసేందుకు సమాయత్తమయ్యారు. ఈ క్రమంలోనే ఆదివారం సికింద్రాబాద్ నియోజకవర్గం సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా సీతాఫల్మండిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావుగౌడ్తో పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి , పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కమిటీల నిర్మాణాల్లో అన్నివర్గాలకూ ప్రాధాన్యతనిస్తూ సామాజిక న్యాయాన్ని పాటించేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్, బండి రమేశ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని 222 బూత్లతో పాటు 120 బస్తీల్లో కమిటీల నియామకం పారదర్శకంగా కొనసాగేలా, పార్టీ పరంగా చురుకైన వారిని ప్రత్యేకంగా గుర్తించి బాధ్యతలు అప్పజెప్పాలని నిర్ణయించారు. భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని మెజార్టీ డివిజన్లలో యువతకే అవకాశం ఇచ్చేలా అడుగులు వేస్తున్నారు. ఈ నెల 20 లోపు కమిటీల ఏర్పాటు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే పార్టీ కమిటీలు బలంగా ఉండాలన్నదే సీఎం లక్ష్యమన్నారు. అందుకే సంస్థాగత నిర్మాణాన్ని ఓ క్రమ పద్ధతిలో విజయవంతంగా నడిపించేందుకు కృషి చేస్తున్నారు.