సిటీబ్యూరో, జూలై 15 (నమస్తే తెలంగాణ ) : గత సంవత్సరంతో పోల్చితే నగరంలో డెంగీ కేసులు చాలా తక్కువగా ఉన్నాయని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ డాక్టర్ రాంబాబు అన్నారు. గురువారం చార్మినార్ జోన్లోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చాంద్రాయణగుట్ట సర్కిల్ పరిధిలోని కుమ్మరిబస్తీలో, గుర్రం చెరువు ప్రాంతంలో రసాయనాల పిచికారీని పరిశీలించారు. సంతోష్నగర్, గౌలిపుర ప్రాంతాల్లోని డెంగీ అనుమానిత కాలనీల్లో పర్యటించారు. స్థానిక నాయకులతో కలిసి డెంగీ వ్యాధిపై కరపత్రాలను విడుదల చేశారు. దోమల నివారణకు గాను 300 చిన్న ఫాగింగ్ మిషన్లు, 64 పెద్ద ఫాగింగ్ మిషన్లు వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో చార్మినార్ జోన్ సీనియర్ ఎంటమాలజిస్ట్ నామాల శ్రీనివాస్, అసిస్టెంట్ ఎంటమాలజిస్ట్ రాజమని, సూపర్వైజర్లు లక్ష్మయ్య, రమేశ్, మహేశ్, ఎంటమాలజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.