హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): కరోనా తగ్గినా.. రోగులకు ఆ గాయం సలుపుతూనే ఉన్నది. కరోనా రోగుల్లో ఇప్పటి వరకు ఎక్కువగా శ్వాసకోశ సంబంధ వ్యాధులే కనిపించేవి. కానీ, ఆక్స్ఫర్డ్ వర్సిటీ అధ్యయనంలో కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్టు తెలిసింది. సైకోసిస్, చిత్తవైకల్యం, బ్రెయి న్ ఫాగ్ వంటి మానసిక, నాడీ సంబంధిత వ్యాధులు వారికి కునుకులేకుండా చేస్తున్నాయని ది లాన్సెట్ సైకియాట్రీ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది.
12.84 లక్షల మందిని ఈ అధ్యయనంలో పరీక్షించారు. అందు లో మధ్య వయస్సు నుంచి వృద్ధులకే పోస్ట్ కొవిడ్ సమస్యలు ఎక్కువగా వస్తున్నట్టు తేలింది. ఆల్ఫా బారినపడినవారే అత్యధికంగా మానసిక, నాడీ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించారు.
కొవిడ్ సోకిన తర్వాత ఆరు నెలల్లోనే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని మొదట్లో తేలిందని, ప్రస్తుతం రెండేండ్ల వరకూ ఆ అవకాశం ఉన్నదని అర్థమవుతున్నదని ఆక్స్ఫర్డ్ వర్సిటీ ప్రొఫెసర్ పాల్ హారిసన్ తెలిపారు. వీటి నివారణకు పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు.