హయత్నగర్, సెప్టెంబర్ 24: రెక్కాడితే గానీ.. డొక్కాడని కుటుంబం..రోజూ పనికి వెళ్తూ..పిల్లలను పోషించుకుంటున్నారా దంపతులు..కొద్దిరోజులుగా భార్య ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆమెను ఆస్పత్రిలో చూపిస్తూ..భర్తే బతుకుబండీని నెట్టుకొస్తున్నాడు. గురువారం రాత్రి ఆమె మృతిచెందింది. అంతిమ సంస్కారాలకు చేతిలో చిల్లిగవ్వ లేక.. దిక్కుతోచని స్థితిలో.. స్నేహితుడి సహాయంతో మృతదేహాన్ని దుప్పట్లో చుట్టుకుని భుజంపై మోసుకెళ్తూ..చెరువు పక్కన పాతిపెడదామని బయలుదేరాడు. గమనించిన స్థానికులు.. ఇద్దరికీ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
ఈ హృదయ విదారక సంఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… నెల్లూరు జిల్లాకు చెందిన డేగ శ్రీనివాస్ లక్ష్మిని పదేండ్ల కిందట రెండో వివాహం చేసుకున్నాడు. వారికి కూతురు భవానీ(9), కుమారుడు (6). వీరు ఆరు నెలల కిందట హయత్నగర్కు వచ్చి.. హనుమాన్ టెంపుల్ సమీపంలో నివాసముంటున్నారు. పిల్లలిద్దరూ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు.
శ్రీనివాస్ దంపతులు భవన నిర్మాణ పనులకు వెళ్తూ..జీవనం సాగిస్తున్నారు. పని చేస్తేగానీ..ఇల్లు గడవని పరిస్థితి. ఈ క్రమంలో 20 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న లక్ష్మిని స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించాడు. గురువారం రాత్రి ఆమె ఆరోగ్యం విషమించి మరణించింది. అంతిమ సంస్కారాలకు చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో స్నేహితుడు వినోద్కు సమాచారమిచ్చాడు. అతడి సహకారంతో భార్య లక్ష్మి మృతదేహాన్ని దుప్పట్లో చుట్టుకుని భుజాన మోసుకెళ్తూ..బాతుల చెరువు సమీపంలో పాతి పెట్టేందుకు బయలుదేరారు.
గమనించిన స్థానికులు శ్రీనివాస్, వినోద్ను నిలదీశారు.పొంతనలేని సమాధానాలు చెప్పడంతో దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సీఐ సురేందర్, సిబ్బందితో వచ్చి..లక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. శ్రీనివాస్ అతడి పిల్లలు, వినోద్ను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. సీఐ తన సిబ్బందితో మృతురాలి ఇంటిని పరిశీలించి వివరాలను సేకరించారు. లక్ష్మి అనారోగ్యంతో మృతిచెందిందా.? మరేదైనా కారణమా.. అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.
అనారోగ్యం వల్లే లక్ష్మి మృతిచెందినట్లుగా భావిస్తున్నాం. వీఆర్వో ఫిర్యాదు మేరకు అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు కేసు నమోదు చేశాం. పోస్టుమార్టం నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటాం. సీఐ సురేందర్ గౌడ్, హయత్నగర్