కీసర,ఫిబ్రవరి 2 : కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈసంవత్సరం నుంచి భక్తులు ఆన్లైన్ టికెట్ల ద్వారా దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు.కీసరగుట్టలోని కల్యాణ మండపంలో గురువారం జాతర రెండో కో-ఆర్డినేషన్ సమీక్ష సమావేశాన్ని ఆలయ చైర్మన్ రమేశ్శర్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు 5 నుంచి 7లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని, వారి సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఈనెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని, ఈ సంవత్సరం పాసులను తీసేసి ఆన్లైన్ విధానం ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి సులభమైన మార్గాన్ని ఏర్పాటు చేశామన్నారు. స్వామివారి దర్శనం రూ.500, అభిషేకానికి రూ.800, స్వామివారి కల్యాణానికి రూ.1200ను ఆన్లైన్ ద్వారానే చేసుకునే వెసులుబాటును కల్పించామని చెప్పారు. యాదాద్రి తరహాలో కీసరగుట్ట ఆలయంలో కూడా స్వామివారికి విరాళాలను ఇవ్వడానికి ఫోన్పే ద్వారా అవకాశంను కల్పించామన్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఆన్లైన్ టికెట్ల ద్వారా దర్శనం చేసుకునే అవకాశం ఉందని, భక్తులకు ఇబ్బందుల నుంచి విముక్తి కల్పించేందుకే ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.
అనంతరం కీసరగుట్టకు సంబంధించిన వెబ్సెట్ను, ఫోన్పే, ఆన్లైన్ సిస్టమ్ సేవలను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. అలాగే గర్భాలయంలోని స్వామివారిని మంత్రి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహరెడ్డి, అభిషేక్ ఆగస్త్య, డీసీపీ జానకి, కీసర ఆర్డీవో రవికుమార్, కీసరగుట్ట ఆలయ చైర్మన్ తటాకం రమేశ్శర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి కట్టా సుధాకర్రెడ్డి, నాయకపు మాధురి వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.