శంషాబాద్ రూరల్, జూలై 9 : తాను చనిపోతూ.. మరో నాలుగురికి అవయవాలు దానం చేసిన దర్శన్ ముదిరాజ్ సమాజానికి ఆదర్శంగా నిలిచారు. శంషాబాద్ మండలం గండిగూడ గ్రామానికి చెందిన కంచమీది దర్శన్ ముదిరాజ్(55), అతడి భార్య లక్ష్మి (48) ఈనెల 4వ తేదీన గండిగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. స్థానికుల గమనించి వెంటనే వారిని శంషాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు లక్ష్మి మరణించినట్లు ధ్రువీకరించారు. గాయాలైన దర్శన్ను మెరుగైన చికిత్స కోసం నగరంలోని యశోద ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. అయితే, తాను మృతి చెందితే తన అవయవాలను ఇతరులకు దానం చేయాలని కోరాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు దర్శన్ అవయవాలను దానం చేశారు. దర్శన్ నుంచి తీసుకున్న అవయవాలు నాలుగురికి ఉపయోగపడుతాయని వైద్యులు తెలిపినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దర్శన్ స్థానిక శ్రీరేణుకా ఎల్లమ్మ దేవాలయం డైరెక్టర్గా పని చేస్తున్నాడు. అతడి మృతి పట్ల ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, పార్టీ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి, రేణుకా ఎల్లమ్మ దేవాలయం చైర్మన్ రాంనాథ్ ముదిరాజ్, సర్పంచ్ దేవికాజగన్ గౌడ్ సంతాపం ప్రకటించారు. తాను మృతి చెంది.. నాలుగురికి అవయవాలు దానం చేసిన దర్శన్ ఆదర్శంగా నిలుస్తాడని గండిగూడ గ్రామస్తులు పేర్కొన్నారు.