రాజేంద్రనగర్ వద్ద వేగంగా ప్రయాణిస్తున్న బస్సులో నుంచి ఓ ప్రయాణికుడు కింద పడిపోయాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికాైర్డెంది. ఇటువంటి ప్రమాదం ఇంకెవ్వరికీ జరగకూడదన్న సదుద్దేశంతో ‘సెన్స్ బిహైండ్ రోడ్ సేఫ్టీ (సురక్షిత యానం-నిలబెడుతుంది జీవితం)’ పేరుతో ఈ దృశ్యాలను వీడియోగా తయారు చేసి యూట్యూబ్లో ఉంచారు. దాదాపు 3 కోట్ల మంది ఈవీడియోను వీక్షించారు.
ప్రమాదాన్ని విశ్లేషిస్తూ వేలాది మంది తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పంచుకున్నారు.బాచుపల్లి వద్ద ఓ పాదచారి సెల్ఫోన్ మాట్లాడుకుంటూ రోడ్డు దాటుతున్నాడు. అదే సమయంలో బైక్పై వచ్చిన వాహనదారుడు అతన్ని ఢీకొట్టాడు. దీంతో పాదచారి కాలు విరిగింది. బైక్ నడిపే వ్యక్తికి కూడా గాయమైంది. సెల్ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటడం ఎంత ప్రమాదమో ఈ దృశ్యాలతో వీడియోలో పొందుపరిచారు. ఈ వీడియోను దాదాపు 3 లక్షల మంది చూశారు.
రోడ్డు మధ్యలో ప్రయాణిస్తున్న ఓ భారీ వాహనాన్ని ఓ కారు డ్రైవర్ ఓవర్ టేక్ చేయబోయాడు. కానీ అదే భారీ వాహనం వెనకవైపు నుంచి కారును ఢీకొట్టింది. అది అదుపు తప్పి
ఎడమవైపు దూసుకెళ్లి మరో మూడు వాహనాలను ఢీకొట్టాడు. ఇందులో ఇద్దరికి కాలు విరిగింది. ఇలా చిన్న చిన్న తప్పులకు రోడ్డు ప్రమాదాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా ట్రాఫిక్ పోలీసులు వివరించారు. ఈ వీడియోను 30 లక్షల మంది చూశారు. వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
సిటీబ్యూరో, జనవరి 17(నమస్తే తెలంగాణ): వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పించేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేసిన వినూత్న ప్రయత్నం ఇప్పుడు సత్ఫలితాలిస్తున్నది. వాహనాలను నడిపే సమయంలో వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రూపొందిస్తున్న షార్ట్ ఫిలింలు, వీడియోలను ప్రతి రోజూ లక్ష మంది వీక్షిస్తున్నారు. ఈ విధంగా సోషల్ మీడియా ప్లాట్ఫాం మీదుగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు లక్షల మందికి చేరువవుతున్నారు. ఈ ప్రయత్నం కొంత విజయం సాధించామని ట్రాఫిక్ పోలీసు అధికారులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్కుమార్ యూట్యూబ్ ద్వారా లక్ష మందికి చేరువయ్యేందుకు ప్రత్యక శ్రద్ధను తీసుకుని ప్రతి రోజూ వీక్షకులను ఆకట్టుకునేందుకు గ్రాఫిక్స్తో కూడిన వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేయిస్తున్నారు.
సురక్షితమైన ప్రయాణమే లక్ష్యం:సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
వాహనదారుల సురక్షిత ప్రయాణమే మా లక్ష్యం. ఈ నేపథ్యంలోనే వారికి అందుబాటులో ఉండేలా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల యూట్యూబ్ ఛానెల్ ప్రారంభం. దీంట్లో మానవ తప్పిదాల వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు…నిర్లక్ష్యాల వల్ల చోటుచేసుకుంటున్న విషాదాలు ఇలా అన్నింటినీ క్షుణ్ణంగా విశ్లేషించి వాటిని శాస్త్రీయంగా క్రోడీకరించుకుని నివారణ సూచనలు చేస్తున్నాం. సోషల్ మీడియా వేదికగా ప్రతి రోజు లక్ష మందిని చేరుకుంటుండడం సంతృప్తిని ఇస్తున్నది.