హైదరాబాద్ : న్యూఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు సీపీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుపై రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు భారీ వాహనాలను అనుమతించరు. అయితే ఈ సమయంలో లైట్ మోటార్ వెహికల్స్ను ఓఆర్ఆర్పైకి అనుమతి ఇవ్వనున్నారు.
పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేను కూడా రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నారు. అయితే శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లే వాహనాలకు అనుమతి ఉంటుంది. ఇక సైబరాబాద్ పరిధిలో ఉన్న అన్ని ఫ్లై ఓవర్లపైకి రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్ను అనుమతించరు. పాదాచారులకు అనుమతి ఉంటుంది.
శిల్పా లేఅవుట్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్లు, షేక్పేట్ ఫ్లై ఓవర్, మైండ్ స్పేస్, రోడ్ నం -45 ఫ్లై ఓవర్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, సైబర్ టవర్ ఫ్లై ఓవర్, ఫోరం మాల్ – జేఎన్టీయూ ఫ్లై ఓవర్, కైతలాపూర్ ఫ్లై ఓవర్, బాబు జగ్జీవన్ రామ్ ఫ్లై ఓవర్(బాలానగర్) మూసివేయనున్నారు.
ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామన్నారు.