సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ): విధినిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందిన హోంగార్డు జి.శ్రీనివాస్ కుటుంబానికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర రూ.11,60,000చెక్కును అందజేశారు. మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న శ్రీనివాస్ ఈ సంవత్సరం జనవరి 25న కండ్లకోయ జంక్షన్లో విధులు నిర్వర్తిస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందిన విషయం తెలిసిందే. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు సైబరాబాద్తో పాటు హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పనిచేసే పోలీసు సిబ్బంది అంతా కలిసి విరాళాల రూపంలో రూ.11లక్షల 60వేలు సమీకరించారు. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో శుక్రవారం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర జాయింట్ సీపీ(ట్రాఫిక్) నారాయణ్నాయక్, మేడ్చల్ జోన్ డీసీపీ సందీప్లతో కలిసి హోంగార్డు భార్యాపిల్లలకు అందచేశారు. అంతేకాకుండా హెచ్డీఎఫ్సీలో శ్రీనివాస్ వేతనానికి సంబంధించిన ఖాతా ఉండటంతో ఇన్సూరెన్స్ కింద రూ.30లక్షలను అదనపు డీజీ అభిలాష బిస్ట్ అందచేశారు. ఈ సందర్భంగా సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ విధినిర్వహణలో మృతిచెందిన హోంగార్డు శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.