సిటీబ్యూరో, జూన్ 14 (నమస్తే తెలంగాణ): భద్రతా కారణాల దృష్ట్యా దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమి చుట్టూ 5కిలో మీటర్ల దూరంలో రిమోట్ కంట్రోల్తో వినియోగించే డ్రోన్ కెమెరాలు, పారా గ్లిడర్స్, రిమోట్ కంట్రోల్తో వినియోగించే మైక్రో లైట్ ఎయిర్క్రాఫ్ట్స్ను ఎగురవేయడంపై నిషేధం విధిస్తూ సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు.
ఉగ్రవాదులు, సంఘవిద్రోహ శక్తులు డ్రోన్లు, గ్లిడర్స్ వంటి వాటితో దాడులు జరిపే అవకాశం ఉన్నట్లు కేంద్ర భద్రతా వర్గాల నుంచి వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో ఈ ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ తెలిపారు. ఈనెల 13 నుంచి 17వ తేదీ వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా డ్రోన్లను ఎగురవేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.