సిటీబ్యూరో, జనవరి 27 (నమస్తే తెలంగాణ): ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు రాకుండా మరిన్ని మెరుగైన చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనరేట్లో నిర్వహించిన ట్రాఫిక్ రివ్యూ మీటింగ్లో సీపీతోపాటు పలువువు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్పై పలు సూచనలు, ఆదేశాలు జారీచేశారు. ముఖ్యంగా బాటిల్ నెక్ ప్రాంతాలు, ఇరుకుగా ఉండి ట్రాఫిక్కు అంతరాయం కల్పించే ప్రధాన జంక్షన్లపై దృష్టిపెట్టి సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఐటీ సెక్టార్లో ట్రాఫిక్ సులభంగా వెళ్లేందుకు వీలుగా జంక్షన్లను మరింత అభివృద్ధి చేయాలన్నారు. రోడ్డు భద్రతపై మరింత అవగాహన పెంచేలా కార్యక్రమాలు చేపట్టాలని, జంక్షన్ల వద్ద యాచకులు లేకుండా బెగ్గర్ ఫ్రీ జంక్షన్ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే కమిషనరేట్ పరిధిలోని అన్ని ప్రధాన జంక్షన్లను అభివృద్ధి చేసి, ట్రాఫిక్ సాఫీగా వెళ్లేవిధంగా చర్యలు తీసుకున్నామని, పలు చోట్ల కొత్త సిగ్నల్స్ను సైతం ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా సీపీ తెలిపారు. ఈ సమావేశంలో సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ కె.నారాయణ్ నాయక్, ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాసరావు, రోడ్ సేఫ్టీ డీసీపీ ఎల్.ఛత్రియ నాయక్, ట్రాఫిక్ అదనపు డీసీపీ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.