సిటీబ్యూరో, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈనెల 3 నుంచి ప్రారంభం కానున్న అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియను దృష్టిలో పెట్టుకుని పోలీసులు బందోబస్తుపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగా నామినేషన్ కేంద్రాల చుట్టూ నాలుగు అంచెల భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. సోమవారం కమిషనరేట్ పరిధిలోని అన్ని జోన్ల డీసీపీలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సీపీ పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద నాలుగు అంచెల భద్రతను ఏర్పాటు చేయాలంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు. నామినేషన్ కేంద్రాల వద్దకు పెద్ద ఎత్తున అభ్యర్థులు, వారి అనుచరులు వచ్చే అవకాశం ఉంటుందని, ఇది దృష్టిలో పెట్టుకుని సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టాలని ట్రాఫిక్ పోలీసు అధికారులకు సూచించారు.
ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతి ఇచ్చే అంశాలలో ఆర్ఓలను సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. భారత ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని, ఇందులో భాగంగా డబ్బు, మద్యం, ఓటర్లను మభ్యపెట్టే ఇతర వస్తువుల రవాణాకు అడ్డుకట్ట వేసే విధంగా వాహనాల తనిఖీలు నిర్వహించాలన్నారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించే వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయం తీసుకోవాలన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలకు భరోసా కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో సైబరాబాద్ అదనపు సీపీ అవినాశ్ మహంతి, జాయింట్ సీపీ (ట్రాఫిక్) కె.నారాయణ్ నాయక్, బాలానగర్ డీసీపీ శ్రీనివాస్రావు, శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి, మేడ్చల్ డీసీపీ శబరీష్, మాదాపూర్ డీసీపీ సందీప్, రాజేంద్రనగర్ జోన్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి, ఎలక్షన్ సెల్ డీసీపీలు అశోక్కుమార్తో పాటు ఏసీపీలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.