‘మీ అమ్మాయి నచ్చింది. అబ్బాయి కూడా ఇష్టపడడ్డాడు. ఇక ఆలస్యం వద్దు. మేం కూడా ఇండియాలోనే సెటిలైపోదామనుకుంటున్నాం. అమెరికాలో ఉన్న ఆస్తినంతా అమ్మేసి అక్కడికే వచ్చేస్తున్నాం. ఈ లోపు మేం కొన్ని విలువైన డాక్యుమెంట్లు, డాలర్లు పంపిస్తాం’ అంటూ తీయటి మాటలతో సైబర్ నేరగాళ్లు నమ్మించారు. పాతనగరానికి చెందిన ఓ కుటుంబాన్ని రూ.5.8లక్షలు దోచుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పాతనగరానికి చెందిన ఓ యువతికి కుటుంబ సభ్యులు పెండ్లి సంబంధం చూస్తున్నారు. ఈ క్రమంలో మ్యాట్రీమోనీ సైట్లో ప్రొఫైల్ను అప్లోడ్ చేశారు. ఇది చూసిన సైబర్ నేరగాడు.. యువతి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు. తాను ఆమ్స్టర్డామ్లోనివాసముంటూ డ్రిల్లింగ్ ఇంజినీర్గా పనిచేస్తున్నానని చెప్పుకున్నాడు. ఇలా నమ్మించడంతో సైబర్నేరగాళ్లు చెప్పేవి నిజమేనని వారు విశ్వసించారు.
అమెరికాలో తమకున్న ఆస్తులన్నీ అమ్మేసి ఇండియాకే వచ్చేస్తామని కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే నివాసముంటామని సైబర్ నేరగాళ్లు నమ్మబలికారు. దీనికి అమ్మాయి కుటుంబ సభ్యులు కూడా సమ్మతించారు. అయితే వచ్చే ముందు తమ ఆస్తిలోని విలువైన డాక్యుమెంట్లు, నగలు, డాలర్లను అమ్మాయి చిరునామాకు పంపిస్తామని చెప్పారు. హైదరాబాద్లోనే మంచి ఇల్లు కొనుక్కుంటామని తెలిపారు. రెండు రోజుల తరువాత యువతి కుటుంబసభ్యులకు ఫోనొచ్చింది. తాము ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి మాట్లాడుతున్నామని కస్టమ్స్ క్లియరెన్స్ లేకుండా డాలర్లు, గోల్డ్ యువతి పేరుపై పార్సిల్ వచ్చిందంటూ చెప్పారు. పార్సిల్లో కొన్ని కోట్ల విలువైన బంగారం, డాలర్లు ఉన్నాయని అవి విడుదల కావాలంటే కొంత నామమాత్రపు ఫీజు కట్టాల్సి ఉంటుందని నమ్మించారు. ఆ తరువాత యాంటీ టెర్రరిస్ట్ సర్టిఫికెట్, జీఎస్టీ, ఇన్కాం ట్యాక్స్ అంటూ రకరకాల సాకులు చూపించి వారి నుంచి సుమారు రూ.5.8 లక్షలు వసూలు చేశారు. ఇంకా డబ్బులు డిపాజిట్ చేయమని అడుగుతుండటంతో యువతి కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి తెలిసిన వారితో చర్చించారు. ఇదంతా మోసమని వాళ్లు చెప్పడంతో సోమవారం సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.