చిక్కకుండా..దొరకకుండా సైబర్నేరగాళ్లు సరికొత్త వ్యూహాలను అనుసరిస్తున్నారు. ఎంత ‘టెక్నాలజీ’ ఉపయోగించి మోసాలు చేసినా.. పోలీసులు వెంటాడి.. వేటాడి పట్టుకుంటుండటంతో తమ క్రిమినల్ మైండ్లకు పదునుపెడుతున్నారు. సాధారణంగా దొంగల కోసం పోలీస్ శాఖలో ఇన్ఫార్మర్ వ్యవస్థను కొనసాగిస్తుంటారు. ఇదే తరహాలో సైబర్ నేరస్తులు సైతం పోలీసులు వచ్చే సమాచారం తెలుసుకునేందుకు వేగులను ఏర్పాటు చేసుకుంటున్నారు. తమను పట్టుకునేందుకు వస్తే.. అడ్డాలను మార్చేస్తున్నారు. సిటీబ్యూరో, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ)
వివిధ రాష్ర్టాల సైబర్క్రైమ్ పోలీసులు సమన్వయంతో పనిచేస్తుండడంతో సైబర్నేరగాళ్ల అడ్డాలపై ఎవరూ.. ఎప్పుడు దాడి చేస్తారో తెలియని పరిస్థితి. దీంతో రాజస్థాన్, జార్ఖండ్, బిహార్ రాష్ర్టాల్లో తమ నేరాలకు అడ్డాగా మారిన ప్రాంతాల్లో సొంత ఇన్ఫార్మర్ వ్యవస్థను నడిపిస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్నేరాలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఫిర్యాదుల కోసం ప్రత్యేక వెబ్సైట్ సైబర్క్రైమ్.జీవోవీ. ఇన్, టోల్ ఫ్రీ నంబర్ 155260ను అందుబాటులోకి తెచ్చింది. కొందరు బాధితులు పోర్టల్లో ఫిర్యాదు చేస్తుండగా, మరికొందరు ఠాణాలకు వెళ్లి చేస్తున్నారు. వివిధ రాష్ర్టాల నుంచి వచ్చే ఫిర్యాదులన్నీ పరిశీలించి, ఫోన్ నంబర్ల ఆధారంగా ప్రధాన పోర్టల్ నుంచి నేరగాళ్లు ఎక్కడి నుంచి కాల్ చేశారో గుర్తించి..స్థానిక పోలీసులకు ఆ వివరాలు పంపిస్తున్నారు.
పట్టుబడుతున్నారు..
ఎంతో సాంకేతికత ఉపయోగించి.. దోపిడీ పర్వాన్ని కొనసాగించినా.. పోలీసులకు దొరికిపోతుం డటంతో సైబర్ నేరగాళ్లలో వణుకుపుడుతున్నది. దీంతో పోలీసులు వచ్చిపోయే సమాచారాన్ని సేకరిస్తు న్నారు. ఇందుకోసం అడ్డాలు, గ్రామాల చుట్టూ వేగులను నియమించు కుంటున్నారు. పోలీసులు వస్తున్నా రంటే..సైబర్ నేరగాళ్లు గప్చుప్గా స్థావరాలను మార్చేసి.. అజ్ఞాతంలోకి వెళ్లిపోతారు. ఒక్కోసారి పోలీసులకు అడ్డాలు తెలిసిపోతే, కొత్త ప్రాంతానికి మార్చేయడం.. వాడిన సిమ్కార్డులను ధ్వంసం చేసి.. కొత్తవి సమకూ ర్చుకోవడం చేస్తుంటారు.ఇలా ఇన్ఫార్మర్ వ్యవస్థను కొనసాగిస్తూ సైబర్నేరగాళ్లు పోలీసులకు చిక్కకుండా కొత్త ఎత్తులు వేస్తున్నారు.