సిటీబ్యూరో, అక్టోబర్ 13(నమస్తే తెలంగాణ): అత్త చీర కొంటే.. కోడలు ఖాతా ఖాళీ అయిన సంఘటన భువనగిరి టీచర్స్ కాలనీలో చోటుచేసుకుంది. రాచకొండ సైబర్ క్రైం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి టీచర్స్ కాలనీకి చెందిన ఓ మహిళ ఇటీవల ఓ దుకాణంలో చీరను కొనుగోలు చేసింది. దానికి సంబంధించిన నగదు రూ.5 వేలు దుకాణం యజమానికి ఫోన్-పే ద్వారా బదిలీ చేయమని కోడలుకు ఫోన్ చేసి తెలిపింది. అయితే అత్త ఇచ్చిన నంబర్కు నగదు బదిలీ చేసినప్పటికీ దుకాణం యజమాని డబ్బులు రాలేదని తెలిపాడు.
నంబర్ చెక్చేసుకోగా.. తప్పు ఉండటంతో గూగుల్లో ఫోన్ పే కస్టమర్ కేర్ నంబర్ కోసం సెర్చ్ చేసింది. అందులో లభించిన నంబర్కు ఫోన్ చేయగా మీ యోనో బ్యాంక్ ఖాతా వివరాలు చెప్పాలని కోరారు. ఓటీపీ తీసుకుని ఖాతాలోనుంచి రూ.55 వేలు బదిలీ చేసుకున్నారు. ఆందోళనకు గురైన అత్తాకోడళ్లు రాచకొండ సైబర్ క్రైం పోలీలను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
డాటా ఎంట్రీపేరుతో అంబర్పేట్కు చెందిన రాజేశ్ నుంచి సైబర్నేరగాళ్లు రూ.4.3 లక్షలు కాజేశారు. అలాగే ఇన్వెస్ట్మెంట్ పేరుతో మరో వ్యక్తి నుంచి రూ. 2.2 లక్షలు కాజేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సైబర్క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.