NTR- NEEL | పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా రోజురోజుకు వార్తల్లో నిలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ క్రేజ్ను సంపాదించింది. ‘ఆర్ఆర్ఆర్’, ‘దేవర’ వంటి వరుస విజయాల తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడం, ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలను తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించడం ఈ ప్రాజెక్ట్పై అంచనాలను మరింత పెంచుతోంది. అయితే, గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించి షూటింగ్, నటీనటుల ఎంపికపై సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో హీరోతో సమానంగా పవర్ఫుల్ విలన్ పాత్ర ఉంటుందని ఇప్పటికే టాక్. తొలుత మలయాళ స్టార్ టోవినో థామస్ ను నెగటివ్ రోల్ కోసం సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. కానీ డేట్స్ సమస్యల కారణంగా ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఎన్టీఆర్కు ధీటుగా నిలిచే విలన్గా ఆయనను ఎంపిక చేయాలని మేకర్స్ భావిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే చర్చలు జరిగాయని, త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని టాక్ నడుస్తోంది.
ఇక షూటింగ్ ఆగిపోయిందంటూ వచ్చిన వార్తలను చిత్ర బృందం ఖండించింది. ఎన్టీఆర్ లుక్ విషయంలో డైరెక్టర్తో విభేదాలు వచ్చాయని ప్రచారం జరిగినా, అందులో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో భారీ యాక్షన్ సన్నివేశాల కోసం ప్రతి షెడ్యూల్ మధ్య గ్యాప్ తీసుకోవడం సాధారణమేనని, ప్రస్తుతం షూటింగ్ ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగుతోందని తెలిపింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇప్పటివరకు చూడని రగ్గడ్, ఊర మాస్ లుక్లో కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే లీక్ అయిన కొన్ని ఫొటోలు అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచాయి. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ లేదా టైటిల్ టీజర్ విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా రుక్మిణి వసంత్ నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తున్నారు. ఈ సినిమా 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశం ఉంది.