చీటర్లు తెలివి మీరారు. ఎవరినీ వదలడం లేదు. తిన్నగా మాటలు కలిపి… అందినకాడికి దోచుకుంటున్నారు. ఇలా బోయిన్ పల్లికి చెందిన ఓ వ్యాపారి రూ.80 లక్షలు పోగొట్టుకోగా.. పెండ్లి పేరుతో ఓ యువతి రూ.4.8 లక్షలు, ఓఎల్ఎక్స్లో విక్రయానికి ఉంచిన బుల్లెట్ బండి కొనేందుకు యత్నించగా రూ.75 వేలు, ఇంటి అద్దె పేరుతో రూ.45 వేలు, ఓవెన్ రిపేర్ పేరుతో రూ.27వేలు, పర్సనల్ లోన్ కోసం యత్నించగా 20 వేలు ఇలా బాధితులు చీటర్లకు చిక్కి మోసపోయారు.
కంటోన్మెంట్, సెప్టెంబర్ 7: వ్యాపారిని నమ్మించి మోసం చేసిన ఓ వ్యక్తిపై కేసు నమోదు చేసిన సంఘటన బోయిన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం..న్యూ బోయిన్పల్లి పంచవతి కాలనీకి చెందిన కండోయి అనుజ్ ఫతేనగర్లో కండోయి ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ పేరిట ఐరన్, స్టీల్ వ్యాపారం చేస్తుంటాడు. వివిధ సం దర్భాల్లో అనుజ్ తన ఇంటివద్ద నుంచే ఫోన్ ద్వారా వ్యాపార లావాదేవీలు చేస్తుండేవాడు. గుజరాత్, రాజ్కోట్ మాల్దారి ఫాటక్కు చెందిన రాహుల్కుమార్ వంజా, అనుజ్లకు నడుమ గత కొద్ది సంవత్సరాలుగా వ్యాపార లావాదేవీలు కొనసాగుతున్నాయి.
రాహుల్కుమార్ గత సంవత్సరం మార్చిలో అనుజ్కు ఫోన్ చేసి సామగ్రి కావాలని ఆర్డర్ చేశాడు. ఈమేరకు అనుజ్ ఐదు దఫాలుగా మొత్తం రూ.79,94,837 విలువజేసే ఐరన్, స్టీలు సరఫరా చేశా డు. అనంతరం రాహుల్కుమార్ సూచనల మేరకు గత సంవత్సరంలో చెక్కులను బ్యాంకులో సమర్పించగా అవి చెల్లలేదు. అప్పటినుంచి (గత సంవత్సరం జూలై) అతడి ఫోన్ స్విచాఫ్ వస్తుండటంతో అనుమానం వచ్చి బాధితుడు రాజ్కోట్కు వెళ్లాడు. కానీ, రాహుల్ కుమార్ తనకు ఇచ్చింది తప్పుడు చిరునామా అని తెలుసుకొని బోరుమన్నాడు.
ఈ క్రమంలోనే తనకు రాహుల్కుమార్ను పరిచయం చేసిన జయేశ్, యతిన్, విపుల్లను కలువగా వారు డబ్బులు ఇప్పిస్తామని హామీ ఇచ్చి, గత కొద్దిరోజులుగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో రాహుల్కుమార్, జయేశ్, యతిన్, విపుల్లు కలిసి తనవంటి పలువురు వ్యాపారులను మోసం చేసినట్లు తెలుసుకున్న బాధితుడు మంగళవారం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.