సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో సరికొత్త నేరాలు కూడా పుట్టుకొస్తున్నాయి. ప్రధానంగా సైబర్ నేరాలు. సైబర్ నేరగాళ్ల వలకు ఉన్నత విద్యావంతులు కూడా చిక్కి పెద్ద ఎత్తుల మోసపోతున్నారు. గతంలో ఈ తరహా నేరాలు నగరాలు, పట్టణ ప్రాంతాలకే పరిమితమయ్యాయి. నేడు విస్తరించిన ఆన్లైన్ విధానంతో మారుమూల గ్రామాలను సైతం సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. అమాయకుల నుంచి అందినంత దోచుకుంటున్నారు. ఇటీవల బాలానగర్ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్న సైబర్ నేరాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
బాలానగర్, సెప్టెంబర్ 5 :మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ నంబర్ అనుసందానం చేయాలి.. అందుకు మీకు ఓ ఓటీపీ వస్తుంది.. అది చెప్పాలి.. మీ క్రెడిట్ కార్డు అప్డేట్ చేసుకోండి.. అందుకు మీ కార్డు నంబర్, సీవీవీ నంబర్తోపాటు మీ పుట్టిన తేదీ చెప్పాలి.. నౌకరీ డాట్కామ్ నుంచి ఫోన్ చేస్తున్నామని.. మీకు మేము మంచి ఉద్యోగ అవకాశం కల్పిస్తామం.. మీ మొబైల్ నంబర్ రూ. 10వేల గిఫ్ట్కు ఎంపికైంది.. ఇందుకు ఓ లింక్ పంపిస్తాం అందులో మీ అడ్రస్ ఎంటర్ చేయాలంటూ తరచూ అపరిచితుల నుంచి ప్రజలకు ఫొన్కాల్స్ వస్తుంటాయి.
అంతేకాదు.. ఓఎల్ఎక్స్లో క్రయవిక్రయాల పట్ల అపరిచిత వ్యక్తులు మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. టీమ్ వీవర్ ద్వారా మరికొందరూ ప్రజల కళ్లుగప్పి మోసాలు చేస్తున్నారు. రకరకాల మార్గాలను ఎంచుకున్న నేరగాళ్లు.. అమాయకులకు ఫోన్చేసి మోసాలు చేస్తున్నారు. అమాయకులు లక్షలు పోగొట్టుకుంటున్నారు.
ఇటీవల బాలానగర్ పీఎస్ పరిధిలో ఓ మహిళ సన్ డైరెక్ట్ డీటీహెచ్ రీచార్జి చేసే క్రమంలో టీమ్ వీవర్ను డౌన్లోడ్ చేసింది. ఆమె టీమ్ వీవర్ను డౌన్లోడ్ చేసి లాగిన్ అయి పాస్వర్డ్ ఎంటర్ చేయగానే.. సైబర్ నేరస్తులు సదరు ఐడీ పాస్వర్డ్ ఆధారంగా బాధితురాలు బ్యాంకు ఖాతాలో నుంచి పలు మార్లు రూ.1 లక్ష 18 వేల నగదును తస్కరించారు. ఇది గమనించిన గృహిణి మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాలానగర్ నివాసి సాయికుమార్ ఐసీఐసీఐ బ్యాంక్లో ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్గా పని చేస్తున్నాడు. సాయికుమార్ మరో ఉద్యోగం కోసం చేస్తున్న క్రమంలో నౌకరీ డాట్. కామ్లో తన ఎడ్యుకేషన్ ప్రొఫైల్ పెట్టాడు. గతనెల 19న అతడికి 8346801529 నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తాను నౌకరీడాట్ కామ్ నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ మహిళ పరిచయం చేసుకుంది. మీ ప్రొఫైల్ను షార్ట్లిస్ట్ చేశాము. అతి త్వరలో మంచి ఉద్యోగం ఇప్పిస్తాం..అని తెలిపింది. ఇందుకుగాను ఇంటర్వ్యూ ఉంటుంది.
అందుకు రూ.10లు ఫీజు చెల్లించాలి.. సదరు ఫీజు కూడా రిఫండ్ చేస్తామని తెలిపింది. ఫీజు చెల్లించడం కోసం ఓలింక్ పంపించారు. లింక్ను ఓపెన్ చేసి ఫీజు చెల్లించే క్రమంలో తన క్రెడిట్కార్డ్ నంబర్ ఎంటర్ చేయగా రూ. 10లు బదులుగా.. రూ. 25, 314లు డెబిట్ అయ్యాయి. దీంతో కంగారు పడిన సాయికుమార్ బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సైబర్ నేరాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. గుర్తు తెలియని వ్యక్తులు పంపిన లింక్లకు సమాధానం ఇవ్వకూడదు. పరిచయం లేని వ్యక్తులు ఫోన్ చేసి వివరాలు అడిగినా చెప్పరాదు. అలాంటి వారితో చాటింగ్ కూడా చేయకూడదు. ఓఎల్ఎక్స్ లావాదేవీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. టీమ్ వీవర్ ఓపెన్ చేసి కోడ్ నంబర్ గుర్తు తెలియని వారికి తెలియజేయరాదు. అపరిచిత వ్యక్తుల పట్ల ఆన్లైన్ చాటింగ్లకు స్వస్తి పలకాలి. -ఎండీ వహీదుద్దీన్, బాలానగర్ సీఐ