సిటీబ్యూరో, జూలై 19(నమస్తే తెలంగాణ): వాట్సాప్లో వచ్చిన మెసేజ్తో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ రూ.20 వేలు పెట్టుబడిగా పెట్టి రూ.6,200లు లాభం పొందాడు. ఆశతో రూ.ఎనిమిది లక్షలు పెట్టుబడిగా పెట్డాడు. నేరగాళ్లు మొత్తం సొమ్ము కొట్టేశారు. జరిగిన మోసంపై బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి తనకు వస్తున్న జీతం డబ్బులు సరిపోకపోవడంతో కొంత డబ్బును ఏదైనా వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇంతలో అతడి వాట్సాప్కు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్కు స్పందించిన ఇంజినీర్.. ఆ నంబర్కు మాట్లాడి.. వారు చెప్పిన మాటలు నమ్మాడు. తొలుత రూ. 20 వేలు పెట్టుబడిగా పెట్టాడు. ఆ వెంటనే ఇంజినీర్కు ఓ లింక్ ఇచ్చిన నేరగాళ్లు, ప్రత్యేకంగా ఓ పేజీని కూడా కేటాయించారు.
ఈ పేజీలో ఇంజినీర్ పెట్టుబడి, లాభాల వివరాలు ఉన్నాయి. రూ.20వేలు పెట్టుబడిగా రూ.6200 లాభం వచ్చినట్లు పేజీలో కనిపించింది. మరో రెండు సార్లు రూ.20వేలు చొప్పున పెట్టుబడి పెట్టాడు. లాభాలు వచ్చినట్లు పేజీలో సూచించింది. ఆ పేజీలో ఉన్న విత్ డ్రా బటన్ నొక్కి అసలు, లాభం వచ్చిన డబ్బును సంతోషంగా విత్ డ్రా చేసుకున్నాడు. అత్యాశకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ పెద్ద మొత్తంలో లాభం పొందాలని ఒకేసారి రూ. ఎనిమిది లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. ఆ తర్వాత లాభం వచ్చినట్టు పేజీలో కనిపించింది. అయితే, డబ్బులు విత్ డ్రా చేసుకునే బటన్ మాత్రం మయమైంది. నేరగాళ్లు రూ. ఎనిమిది లక్షలు కొట్టేసినట్లు గుర్తించి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.