Gruhajyothi | సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): ఇంటింటికీ తిరిగి కరెంటు మీటర్ రీడింగ్ తీసే సిబ్బంది ఆందోళన బాట పట్టారు. సుదీర్ఘకాలంగా తమ సమస్యల్ని అధికారులకు మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదని, గత్యంతరం లేకే ఆందోళన చేస్తున్నామని మీటర్ రీడర్లు చెబుతున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) పరిధిలో పీస్ రేట్ వర్కర్లుగా పనిచేస్తున్న కరెంటు మీటర్ రీడర్లకు నెలలో కేవలం 15 రోజులు మాత్రమే పని ఉంటుంది.
ఒక మీటర్ రీడింగ్ తీస్తే వారికిచ్చేది కేవలం రూ. 2.51 పైసలు, అందులోనూ 50 నుంచి 60 పైసలు మినహాయించుకొని మిగిలిన సొమ్మును మీటర్ రీడర్లకు చెల్లిస్తున్నారు. ఇలా ప్రతి నెలా 1వతేదీ నుంచి 15వ తేదీ వరకు పనిచేశాక, మిగిలి రోజుల్లో ఖాళీగా ఉండాల్సి వస్తోందని, మిగిలిన 15 రోజుల్లో తమకు పని కల్పించాలని అనేకసార్లు విద్యుత్ సంస్థ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినా, వారు పట్టించుకోవడం లేదని మీటర్ రీడర్లు వాపోతున్నారు.
విద్యుత్ సంస్థలో అనేక విభాగాల్లో తమ సేవలను వినియోగించుకునే అవకాశాలు ఉన్నా, యాజమాన్యం పని ఇచ్చేందుకు అంగీకరించడం లేదని, సుదీర్ఘ కాలంగా ఈ సమస్యపై అనేకసార్లు ఆందోళనలు చేసినా పట్టించుకోకపోవడంతోనే ఆందోళన చేస్తున్నామని టీఎస్ఎస్పీడీసీఎల్ విద్యుత్ మీటర్ రీడర్ల యూనియన్ ప్రధాన కార్యదర్శి జి. చిరంజీవి తెలిపారు. ‘ఉన్నత చదువులు చదువుకొని ఉన్నాం..ఇదే సంస్థను నమ్ముకొని 22 ఏండ్లుగా పనిచేస్తున్నాం.. నెలంతా పని కల్పించి ఆర్టిజన్లుగా గుర్తించాలని చేస్తున్న మా డిమాండ్లను మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి మా సమస్యను గుర్తించి, న్యాయం చేయాలి’ అని కోరుతున్నామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి మీటర్ రీడింగ్తో పాటు వినియోగదారుల ఫోన్ నంబరు, ఆధార్నంబరు, ఆహార భద్రతా కార్డు నంబర్లను నమోదు చేయాలని మీటర్ రీడర్లకు డిస్కం అధికారులు సూచించారు. అయితే విద్యుత్ మీటర్ రీడర్ల ఆందోళన నేపథ్యంలో బిల్లుల జారీలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఇదిలా ఉంటే.. శుక్రవారం విద్యుత్ మీటర్ రీడర్ల యూనియన్ నేతలు టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీని కలవడానికి వచ్చారు. సీఎండీ లేకపోవడంతో ఇతర ఉన్నతాధికారులను కలిశారు. ‘మీ సమస్య మా దృష్టికి వచ్చింది.. పరిశీలిస్తున్నా’మని వారు తెలిపారు. ఈనెల మీటర్ రీడింగ్ తీసే వారికి 2 రూపాయలు అదనంగా ఇస్తామని అధికారులు చెప్పినా, అయిష్టంగానే నేతలు వెళ్లిపోయారు.