కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తుండటంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. అవసరమైతేనే రోడ్లపైకి వస్తున్నారు. గత ఏడాది విధించిన లాక్డౌన్ అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో జూలై నుంచి నగర రోడ్లపై సాధారణ పరిస్థితి నెలకొన్నది. అయితే ఇటీవల కరోనా వైరస్ తిరిగి విజృంభించడంతో తప్పని సరిగా మాస్కు ధరించాలని, భౌతికదూరం పాటించాలని, చేతులను శానిటైజ్ చేయాలని ప్రభుత్వం సూచనలు చేస్తున్నది. దీంతోపాటు రాత్రి వేళల్లో కర్ఫ్యూను కూడా విధించింది. సామాన్య ప్రజలు రోడ్లపైకి రావడం తగ్గించారు. స్వీయ నియంత్రణతోనే వైరస్ను కట్టడిచేయవచ్చనే నిర్ణయానికి వచ్చి నిబంధనలు పాటిస్తున్నారు. దీంతో రోడ్లపైకి వచ్చే వారి సంఖ్య రోజు రోజుకూ తగ్గుముఖం పడుతున్నది. రాత్రి 8 గంటల వరకు అన్ని రకాల వ్యాపార సముదాయాలు మూతపడుతున్నాయి. సాధారణంగా రోడ్లపై గంటకు 4 లక్షల వాహనాలు రాకపోకలు సాగించేవి. కొన్ని ప్రైవేట్ సంస్థలు వర్క్ ప్రం హోమ్ అమలు చేయడంతో పాటు ప్రజలు సైతం ఇంటినుంచి భయటకు రాకపోవడంతో ప్రస్తుతం వాటి సంఖ్య సగానికిపైగా తగ్గింది. ఇదిలా ఉండగా ప్రత్యేక పికెటింగ్లో భాగంగా పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. మాస్కులు ధరించని వారిపై సీసీ కెమెరాలతో నిఘా పెట్టడంతో ప్రతి రోజు సుమారు 3వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి.