భారీ వర్షాల నేపథ్యంలో నగరవాసులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను నివారించేందుకు, పూర్తిగా తగ్గించడానికి తక్షణమే చేపట్టాల్సిన చర్యలపై ప్రణాళిక రూపొందించాలని సూచించారు. వెదర్ ఫోర్ కాస్ట్ సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులకు, పౌర సమాజాల వాట్సాప్ గ్రూపులకు పంపి చేపట్టాల్సిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. ఈ మేరకు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డీజీపీ రవిగుప్తా, విపత్తుల నిర్వహణ, ఫైర్ సర్వీసుల శాఖ డీజీ నాగిరెడ్డి, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు హాజరయ్యారు.
వర్షాలకు సంబంధించిన సమాచారాన్ని విస్తృత స్థాయిలో ప్రజలకు అందించేందుకు తగు వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సీఎస్ శాంతికుమారి సూచించారు. హైదరాబాద్ నగరంలో దాదాపు 134 ప్రాంతాలను Vulnerable locations గా గుర్తించడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాంతాలలో తిరిగి Stagnation జరగకుండా చేపట్టాల్సిన చర్యలను సూచించాలని కోరారు. జీహెచ్ఎంసీ, జలమండలి, పోలీస్, ఎస్పీడీసీఎల్ తదితర శాఖల అధికారులు ఒక కమిటీగా ఏర్పడి ఈ వాటర్ లాగింగ్ పాయింట్లను తనిఖీ చేసి, వీటి నివారణకు తగు సూచనలను చేయాలని సీఎస్ ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో వర్షపు నీటిని నిలువ చేసేందుకు పలు ప్రాంతాలలో భారీ ప్రమాణం కలిగిన నీటి నిల్వ ట్యాంకులను నిర్మిస్తున్నామని, వీటిలో ఇప్పటికే మూడు ట్యాంకుల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని తెలియచేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న డిజాస్టర్ రెస్పాన్స్ విభాగాన్ని మరింత పటిష్టపరచడానికి చేపట్టాల్సిన చర్యలను సూచించాలని శాంతి కుమారి కోరారు.
నగరంలో ప్రధానంగా సైబరాబాద్ పరిధిలోని రద్దీ ప్రాంతాలలో రహదారులపై వాహనాలు బ్రేక్ డౌన్ అయితే, వాటిని వెంటనే తొలగించడానికి అదనపు క్రేన్లను అందించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు.