శామీర్పేట, జూలై 1: విద్యార్థులు సైనికులవలె కృత నిశ్చయంతో ముందుకు సాగాలని సీఆర్పీఎఫ్ ఆర్ఆర్వై డీఐజీపీ (డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) బ్రిజేష్ సింగ్ అన్నారు. మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సీఆర్పీఎఫ్ పాఠశాల సిల్వర్ జూబ్లీ వేడుకలను గురువారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐజీపీ మాట్లాడుతూ విద్యార్థులు సామాజిక దృక్పథంతో విద్యా, ఆరోగ్య, మానసిక ఎదుగుదలతో ఒక కృత నిశ్చయం వైపు పయనించాలన్నారు. సైనికుల వలె కష్టించి ఉన్నత వనరులను ఉపయోగించుకుంటూ ఉపాధ్యాయుల మార్గదర్శకాలతో తల్లిదండ్రుల ఆశయ సాధనకు కఠోర శ్రమతో ముందుకు సాగాలన్నారు.
ఇప్పటి వరకు కొవిడ్ విపత్కర పరిస్థితులు తలెత్తడం విచారకరమన్నారు. విద్యార్థులు ఆన్లైన్ పాఠాల్లో ఉన్నా ఈ తరుణంలో చాలా విషయాలు నేర్చుకొనవచ్చన్నారు. సీఆర్పీఎఫ్ ఇంతింతై వటుడింతై అన్న చందంగా నేడు మహావృక్షమై రాష్ట్ర జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి చేరుకోవడం శుభ పరిణామం అన్నారు. కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ కమాండెంట్ సునీల్ కుమార్, ఇన్చార్జి ప్రిన్సిపాల్ డి.అపర్ణ, హెచ్ఎం ఆశాజి కుమార్, గోపాలకృష్ణ, వెంకటరాజు, చంద్రశేఖర్, పీడీ కే.రాజశేఖర్, నవనీత, సబీనా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.