బాల్స్..రన్స్.. వికెట్స్..!
ఒక్కో అంశంపై బెట్టింగ్
ఢిల్లీ, ముంబై, మహారాష్ట్ర కేంద్రాలుగా దందా
అక్కడి నుంచే ప్రధాన బుకీల వ్యవహారం
పోలీసుల నజర్.. పట్టుబడుతున్న ముఠాలు
సిటీబ్యూరో, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): బాల్స్..రన్స్.. వికెట్లు ఇలా.. ఒక్కో అంశంపై బెట్టింగ్లు నిర్వహిస్తూ.. ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్ కేంద్రాలుగా దందా సాగిస్తున్నారు పందెం రాయుళ్లు. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతుండటంతో ఈ వ్యవహారం మరింత జోరందుకున్నది. ఈ క్రమంలో నగర పోలీసులు ప్రత్యేకంగా నజర్ పెట్టి.. నిందితుల ‘ఆట’ కట్టిస్తున్నారు. అయితే సబ్ బుకీలు చిక్కుతున్నా.. ఇతర రాష్ర్టాల్లో ఉండే ప్రధాన బుకీలు మాత్రం దొరకడం లేదు.
ఆన్లైన్లో వీక్షిస్తూ..
ఇతర రాష్ర్టాల్లో ఉండే ప్రధాన బుకీల పర్యవేక్షణలో పలువురు సబ్ బుకీలు హైదరాబాద్లో బెట్టింగ్ కొనసాగిస్తుండగా, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్ కేంద్రాలుగా ప్రధాన బుకీలు వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ల నేపథ్యంలో సబ్ బుకీలుగా చలామణి అయ్యే వారు ఆయా ఆన్లైన్లో యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు పొందుతున్నారు. లైవ్ క్రికెట్ మ్యాచ్లను ఆన్లైన్లో వీక్షిస్తూ.. మ్యాచ్లు, బాల్స్, రన్స్, వికెట్లు ఇలా..ఒక్కో దానికి ప్రత్యేకంగా బెట్టింగ్ నిర్ణయిస్తున్నారు. నగరంలోని సబ్బుకీల కింద పంటర్లతో టచ్లో ఉండేందుకు మరికొందరు సహకరిస్తున్నారు. అయితే ఎప్పుడో ఓ సారి ప్రధాన బుకీలు పోలీసులకు చిక్కుతున్నా.. ఇతర రాష్ర్టాల్లో ఉండి భారీ ఎత్తున బెట్టింగ్ దందా నిర్వహించే ప్రధాన బుకీలు మాత్రం చిక్కడం లేదు.
ఫ్లాట్లను అడ్డాలుగా చేసుకొని..
అపార్టుమెంట్లలోని ఫ్లాట్లను అడ్డాలుగా చేసుకొని ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లకు బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. స్థానిక పోలీసులు, టాస్క్ఫోర్స్ సిబ్బంది ప్రతినిత్యం నిఘాను పటిష్టం చేసి.. ఈ బెట్టింగ్ రాయుళ్లను అరెస్ట్ చేస్తున్నారు. పట్టుబడుతున్న ముఠాల్లో ఇక్కడి నిర్వాహకులు తమ బాస్లు ఇతర రాష్ర్టాల్లో ఉన్నారని చెబుతున్నారు. కొందరు ప్రధాన బుకీలు ఎవరో తమకు తెలియదని, తాము ఆన్లైన్లో బెట్టింగ్కు సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్లి యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు కొన్నామని అంటున్నారు.
నలుగురు అరెస్ట్.. రూ. 1.21 లక్షలు స్వాధీనం
క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడితో పాటు ముగ్గురు పంటర్లను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ రాధాకిషన్రావు కథనం ప్రకారం.. చిలకలగూడకు చెందిన సంబారి విజయ్కుమార్ ఫార్మసీ వ్యాపారి. ఐపీఎల్ నేపథ్యంలో ఢిల్లీలో ఉండే ప్రధాన బుకీ పీజీ భాయ్ని సంప్రదించాడు. ఓ వెబ్సైట్లో యూజర్ ఐడీ, పాస్వర్డ్ తీసుకున్నాడు. చిలకలగూడ పోలీస్స్టేషన్ సమీపంలో అడ్డాను ఏర్పాటు చేసుకొని 20 మంది పంటర్లతో బెట్టింగ్ నిర్వహిస్తుండగా టాస్క్ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. విజయ్కుమార్తో పాటు పంటర్లు దంగుల రమేశన్, మహ్మద్ అతీఖ్, నందమూడి సంతోష్కుమార్ పట్టుబడ్డారు. రూ. 1,21,500 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు తదుపరి విచారణను చిలకలగూడ పోలీసులకు అప్పగించారు.