అమరావతి: రాష్ట్రంలో అప్రతిహతంగా సాగుతున్న సంక్షేమ కార్యక్రమాలు టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊపిరాడకుండా చేస్తున్నాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ‘ఆశలు చూపించాలి కానీ అమలు చేస్తే ఎలా అనే మైండ్ సెట్ తో ఉన్న వ్యక్తి అయోమయంలో పడ్డాడని తెలిపారు. జీవన ప్రమాణాలు పెరిగి జనం చైతన్యవంతులైతే ఇక తమకు పుట్టగతులుండవనే భయం పట్టుకుందని ఆయన విమర్శించారు. విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా పలు అంశాలపై స్పందించారు.
‘ఆశలన్నీ చెల్లాచెదురైన తర్వాత తండ్రీ కొడుకుల భాష మారడంలో వింతేమి లేదు. పార్టీ లేదు బొక్కా లేదు అని స్వయంగా పార్టీ అధ్యక్షుడే అన్నాక వీళ్ల సంస్కారహీన వీరంగాలు ఇలాగే ఉంటాయి. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణాలో లాగే అభ్యర్థులు కూడా దొరకరు. రాసి పెట్టుకో బాబూ.’ అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
‘కరోనా నియంత్రణ, పరీక్షలు, వైద్య రంగ మౌలిక సదుపాయాల కల్పనలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది రాష్ట్రం. అయినా మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయిన బాబు, అద్దె మైకులు, అను’కుల మీడియా రాద్దాంతం కొనసాగుతూనే ఉంది. కష్ట కాలంలో బాధ్యత లేకుండా వ్యవహరించినందుకు ప్రజలు తప్పక బుద్ధి చెబుతారని’ మండిపడ్డారు.