శేరిలింగంపల్లి : పెయింగ్ గెస్టు హస్టల్లో గదిని అద్దెకు తీసుకొని గుట్టుచప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను మాదాపూర్ ఎస్ఓటీ, గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు బుకీలతో పాటు మరో నలుగురు అసిస్టెంట్ బుకీలు మొత్తం 7 గురిని పోలీసులు అరెస్టు చేయగా ప్రధాన బుకీలు ముగ్గురు పరారీలో ఉన్నారు.
ముఠాపై దాడిచేసి నిందితుల వద్ద నుంచి రూః 15,10,000 నగదుతో పాటు మొత్తం రూః 36,50,000 విలువ కలిగిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబందించిన వివరాలు గచ్చిబౌలి డీసీపీ కార్యాలయంలో మంగళవారం మాదాపూర్ డీసీపీ యం.వెంకటేశ్వర్లు మీడియా సమావేశంలో వెల్లడించారు.
మహారాష్ట్ర పుణే నగరానికి చెందిన కాశీప్ ఉమెర్ ఆలియాస్ కాశీప్ అన్సారీ నగరంలోని దూల్పేట్ మంగళ్ఘట్ ప్రాంతానికి చెందిన చంద్రపాల్ అలియాస్ పాల్, అజార్ అలియాస్ అజ్జులు ప్రదాన బుకీలుగా వ్యవహరిస్తూ క్రికెట్ బెట్టింగ్ను నిర్వహిస్తున్నారు.
మంగళ్ఘట్ ప్రాంతానికి చెందిన దరమ్సింగ్ (44), సీతారాంబాగ్కు చెందిన అశీష్ కాలియా (36), జిమెరాత్బజార్కు చెందిన మనోజ్కుమార్ (42), యోగేష్ సింగ్ (22), అఘాపూరకు చెందిన అరుణ్ కుమార్ శర్మ(41), దూల్పేట్కు చెందిన మహేందర్ సింగ్ (34), రాజాస్థాన్ జైపూర్కు చెందిన కమల్ కుమార్ మీనా (32)లు ముఠాగా ఏర్పడ్డారు.
ఇందుకోసం గచ్చిబౌలి టీఎన్జీవోస్ కాలనీలోని విహాంగా కో లీవింగ్ ఫీజీ హస్టల్లో 204 నెంబర్ గదిని రోజుకు రూః 800 అద్దె చొప్పున నెలరోజులకు అధ్దెకు తీసుకున్నారు. లీవ్, లైన్ గురూ, క్రికెట్ బజ్, క్రికెట్ మజా యాప్లను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి వాటి ద్వారా టీ-20 వరల్డ్ కప్ 2021లో భాగంగా సోమవారం ఇగ్లాండ్, శ్రీలంక దేశాల మధ్య జరిగిన మ్యాచ్కు సంబందించి బెట్టింగ్కు పాల్పడుతున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్ ఎస్ఓటీ, గచ్చిబౌలి పోలీసులు రాత్రి 10ః30 గంటల సమయంలో దాడిచేశారు. ఈ దాడిలో 10 మంది మఠా సభ్యుల్లో ప్రదాన బుకీలు కాశీప్ ఉమెర్, చంద్రపాల్, అజార్ పరారీలో ఉండగా మిగతా 7 గురిని అరెస్టు చేశారు.
వారి వద్ద నుంచి రూః 15,10,000 నగదుతో పాటు 11 స్మార్ట్ఫోన్లు, 3 ల్యాప్టాప్లు, 1 రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్రవాహనం, కియా కారు, సుజుకీ జూపీటర్ వాహనాలు, బెట్టింగ్ నిర్వహించే కమ్యూనికేటర్ భోర్డు మొత్తం రూః 36,50,000 విలువ కలిగిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
మాదాపూర్ ఏసీపీ రఘునందన్ రావు, ఎస్ఓటీ సీఐ శివకుమార్, గచ్చిబౌలి సీఐ సురేష్, ఎస్ఓటీ ఎస్ఐ విజయవర్ధన్లతో పాటు పలువురు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.