జీడిమెట్ల, ఏప్రిల్ 18 : క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠాను మాదాపూర్ ఎస్ఓటీ, కేపీహెచ్బీ పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.20 లక్షల నగదుతో పాటు ల్యాప్టాప్లు, సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం బాలానగర్ జోన్ డీసీపీ శ్రీనివాస్రావు షాపూర్నగర్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 17న సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ జట్ల మధ్యన జరిగిన టీ-20 మ్యాచ్ దృష్ట్యా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు మాదాపూర్ ఎస్ఓటీ టీంతో పాటు కేపీహెచ్బీ పోలీసులు కేపీహెచ్బీ కాలనీ హిందూ ఫార్చున్ ఫీల్డ్స్ ఫేస్ 5 సీబ్లాక్ ప్లాట్ నంబర్ 505లో ఆన్లైన్ ద్వారా బెట్టింగ్లు నిర్వహిస్తున్న గుంటూరు జిల్లా కేంద్రం లాంచెస్టారోడ్ ప్రాంతానికి చెందిన కొనగటి హరిన్ చైతన్య ప్రమోద్ (34), గుంటూరు జిల్లా రెడ్డిపేట నర్సారావు పేటకు చెందిన జుజురి మెహర్చౌదరి(29), ఏపీ బాపట్ల జిల్లా కొరుసుపాడు మండలంలోని బలరాం కృష్ణానగర్ గ్రామానికి చెందిన మడల అవేంద్ర(29)ను పట్టుకున్నారు.
వారి వద్ద నుంచి రూ.20 లక్షల నగదుతో పాటు 10 మొబైల్స్, 9 స్మార్ట్ఫోన్లు, 2 ల్యాప్టాప్లు, కారు, కమ్యూనికేటర్ బోర్డును స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు కోనేటి నాగశ్రీను, సాయినాయుడు పరారీలో ఉన్నారు. ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే సైబరాబాద్ వాట్సాప్ నంబర్ 9490617444కు సమాచారం ఇవ్వాలని కోరారు. చాకచక్యంగా ముఠాను పట్టుకున్న మాదాపూర్ ఎస్ఓటీ టీంతో పాటు కేపీహెచ్బీ పోలీసులను డీసీపీ అభినందించారు. ఈ సమావేశంలో కూకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్, సీఐ కిషన్, మాదాపూర్ ఎస్ఓటీ టీంతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.