క్రికెట్ అంటేనే అందరికీ ఎంతో క్రేజీ. అది కూడా భారత్ చిరకాల ప్రత్యర్థి పాక్తో మ్యాచ్ ఆడితే.. ఉపఖండమంతా కండ్లార్పకుండా ఉత్కంఠతతో చూసింది. భారత్ గెలవాలని పూజలు, హోమాలు చేశారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే చెప్పాల్సిన అవసరం లేదు. భారత్-పాక్ మధ్య వారాంతపు సెలవు (ఆదివారం) రోజున మ్యాచ్ ఆడటం నగరవాసులకు ఇంకా ప్రత్యేకమే. ఎక్కడ చూసినా అభిమానుల సందడి నెలకొంది. జాతీయ జెండాల రెపరెపలు దర్శనమిచ్చాయి. అభిమానుల కేరింతలతో ఎటు చూసినా సందడే కనిపించింది. క్రికెట్ అభిమానుల కోసం నగరంలోని పలు ప్రాంతాల వీధుల్లో పెద్ద పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఏ ప్రాంతంలో చూసినా దాయాదుల క్రికెట్ సమరంపైనే చర్చ జరిగింది. దుబాయ్ వేదికగా జరిగిన టీ 20 ప్రపంచకప్ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ను నగరవాసులు ఎంతో ఆసక్తిగా తిలకించారు.