హైదరాబాద్: హైదరాబాద్లో నేరాల శాతం కొద్దిగా పెరిగిందని సీపీ శ్రీనివాస్ రెడ్డి (CP Srinivas Reddy) అన్నారు. 2022తో పోలిస్తే 2023లో 2 శాతం నేరాలు అధికమయ్యాయని చెప్పారు. స్థిరాస్తి నేరాలు 3 శాతం అధికమయ్యాయని వెల్లడించారు. అదేవిధంగా మహిళలపై నేరాలు పెరిగాయని తెలిపారు. హైదరాబాద్లో నేరాలపై వార్షిక నివేదికను సీపీ శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారు. ఈ ఏడాది కాలంలో నగరంలో లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ల కన్నా ట్రాఫిక్ పీఎస్లు పెరిగాయన్నారు. నగరంలో ప్రస్తుతం 31 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయని చెప్పారు. త్వరలో మరికొన్ని పోలీస్ స్టేషన్లు వస్తాయని వెల్లడించారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.
సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదులు పెరిగాయని, అలాంటివాటిని వేగంగా పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. ఈ ఏడాది దోపిడీలు 9 శాతం అధికమవగా, పోక్సో కేసులు 12 శాతానికి తగ్గాయని వెల్లడించారు. ఈ ఏడాది 79 హత్యలు, 403 రేప్ కేసులు, 242 కిడ్నాప్లు, 4,909 చీటింగ్ కేసులు నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాలు 2637 జరుగగా, 262 హత్యాయత్నాలు, 91 చోరీలు జరిగాయని తెలిపారు. పోగొట్టుకున్న సొత్తులో 75 శాతం రికవరీ అయిందని చెప్పారు. ఈ ఏడాది కాలంలో 63 శాతం నేరస్థులకు శిక్షలు పడ్డాయని తెలిపారు. 13 కేసుల్లో 13 మందికి జీవిత ఖైదు పడిందని చెప్పారు. వివిధ కేసుల్లో జరిగిన నష్టం విలువ రూ.38 కోట్లుగా ఉందని పేర్కొన్నారు.
మహిళలపై నేరాలు 12 శాతం పెరిగాయన్నారు. మహిళలపై 2022లో 343 రేప్ కేసులు నమోదవగా, ఈ ఏడాది ఆ సంఖ్య 403కు చేరిందన్నారు. సైబర్ నేరాలు 11 శాతం అధికమయ్యాయని చెప్పారు. గతేడాది సైబర్ నేరాల్లో రూ.82 కోట్లు మోసపోతే ఈ ఏడాది రూ.133 కోట్లు కాజేశారని వెల్లడించారు. ఇక ఆర్థిక నేరాలు 2022లో 292 కేసులు నమోదవగా, 2023లో 344 కేసులు వచ్చాయన్నారు.
ఈ ఏడాది అన్ని పండుగలు, ర్యాలీలను ప్రశాంతంగా నిర్వహించామన్నారు. అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో సదస్సులు నిర్వహించామని తెలిపారు. దేశంలో మొదటిసారిగా సైబర్ క్రైమ్ వింగ్ను ఏర్పాటు చేశామని తెలిపారు. సైబర్ సెక్యూరిటీపై నిపుణులను పిలిచి అవగాహన కల్పించామని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనకు నార్మోటిక్ బ్యూరో తీవ్రంగా కృషి చేస్తున్నదని వెల్లడించారు. మత్తు పదార్థాలు సరఫరా చేసేవాళ్లు ఎక్కడున్నా పట్టుకుంటామని చెప్పారు. డ్రగ్స్ను నిర్మూలించేందుకు స్నిపర్ డాగ్స్ను వినియోగిస్తున్నామని తెలిపారు. నూతన సంవత్సర వేడుకను అర్ధరాత్రి ఒంటి గంట లోపు ముగించాలని సూచించారు. నిబంధనలను అధిగమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశించారు.