సిటీబ్యూరో, జూన్ 14(నమస్తే తెలంగాణ): అతి పెద్ద ట్రావెల్ ఏజెన్సీ నడిపించాలని కోరిక.. తన వద్ద కార్లను లీజుకు పెడితే భారీగా అద్దెలు చెల్లిస్తానని నమ్మించి మోసం చేసిన ఒకరితో పాటు ఇందుకు సహకరించిన ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం గచ్చిబౌలి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ సజ్జనార్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. రామచంద్రాపురం ఎస్ఎన్ కాలనీకి చెందిన పల్లె నరేశ్కుమార్ ఎంటెక్ చదివాడు. చేవెళ్లలోని ఓ ప్రైవేట్ కంపెనీలో మెయింటెనెన్స్ మేనేజర్గా చేరాడు. అక్కడ మూడేండ్లు పని చేశాడు. ఆ సమయంలో ఆ కంపెనీలో కార్లను లీజుకు పెడుతున్న ప్రక్రియపై అవగాహన పెంచుకున్నాడు. తాను కూడా ఓ పెద్ద ట్రావెల్ ఏజెన్సీ పెట్టి భారీగా డబ్బులు సంపాదించాలని ఆశ పడ్డాడు. అనుకున్నట్లుగానే రామచంద్రాపురంలో ఓ ట్రావెల్స్ కార్యాలయాన్ని తెరిచాడు. ఇందుకోసం అనేక మందిని సంప్రదించాడు. తనకు కార్పొరేట్ సంస్థలు, కంపెనీలతో ఒప్పందాలు ఉన్నాయని కార్లు లీజుకు ఇస్తే భారీగా అద్దెలు చెల్లిస్తానని నమ్మబలికాడు. ఇందుకు ఆకర్షితులైన వారు దాదాపు రెండేండ్లలో 272 మంది తన కార్లను పల్లె నరేశ్కు లీజుకు ఇచ్చారు. కొంతమంది అద్దెకు ఆశపడి కొత్తకార్లను కొనుగోలు చేసి లీజుకు ఇవ్వగా కారు మోడల్ను బట్టి రూ.20 వేల నుంచి రూ.60 వేల వరకు అద్దె చెల్లించాడు. ఇలా లీజుకు తీసుకున్న వారికి మూడు నెలలు మాత్రమే అద్దె చెల్లించే ఆ తర్వాత ఇవ్వడం మానేశాడు. దీంతో 208 మంది కార్ల యజమానులు నరేశ్తో గొడవపడి వాహనాలను తీసుకుపోయారు.
అయితే యజమానులు తమ కార్లను వెనక్కి తీసుకుపోతుండటంతో వ్యాపారం మూతపడకుండా ఉండేందుకు రొటేషన్ చేయాలన్న ఆలోచనలో ఉన్న నరేశ్ లీజుకు తీసుకున్న వాహనాలను కమీషన్ ఆశ చూపి బి.రాజు నాయక్, కె.వికాస్, జి.భరత్ జోషి, బి.ఎలక్షన్రెడ్డి, టి.నరసింహగౌడ్ ద్వారా వాటిని సగం ధరలకే విక్రయించడం ప్రారంభించాడు. అడ్వాన్సులు తీసుకొని.. బ్యాంకులు నిర్వహించిన ఆక్షన్లో వీటిని కొన్నానని.. కార్లకు సంబంధించిన పత్రాలను రెండు మూడు నెలల్లో ఇస్తానని వాహనాలు కొన్నవారిని నమ్మించాడు. ఇలా అనేక మంది నరేశ్ మాటలు నమ్మి పత్రాలు ఇవ్వకున్నా అడ్వాన్సులు చెల్లించి కారులు తీసుకున్నారు. తీరా పత్రాలు ఇస్తానన్న గడువు ముగిసినా నరేశ్ నుంచి స్పందన లేదు. ఇదిలా ఉంటే రామచంద్రాపురానికి చెందిన ఓ వ్యాపారి నరేశ్కుమార్ వద్ద 11 కార్లను లీజుకు పెట్టాడు. ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన సైబరాబాద్ పోలీసులు నరేశ్ మోసాన్ని బయటపెట్టారు. నరేశ్కుమార్తో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి దాదాపు 50 కార్లను స్వాధీనం చేసుకున్నారు. మరో 13 కార్లను రికవరీ చేయాల్సి ఉందని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ కేసును ఛేదించిన రామచంద్రాపురం పోలీసు అధికారులకు సీపీ సజ్జనార్ రివార్డులు అందజేశారు. సమావేశంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.