బండ్లగూడ, జూలై 6 : సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. మంగళవారం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్గూడ హిమసాయి అపార్ట్మెంట్ వాసులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీపీ.. వారికి సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. ఆన్లైన్ అకౌంట్ నిర్వహించేవారు, ఫేస్బుక్ ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గుర్తు తెలియనివారి నుంచి వచ్చే ఫోన్లపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.. ఇటీవల ఫేస్బుక్ అకౌంట్లను హ్యాక్చేసి.. తమ బంధువులు దవాఖానలో ఉన్నారు.. అర్జెంట్గా డబ్బులు పంపించాలంటూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని.. డబ్బులు పంపించేటప్పుడు అసలు వ్యక్తికి ఫోన్చేసిన తర్వాతనే పంపించాలన్నారు. సైబర్ నేరాలను అదుపు చేసేందుకు ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ సెల్ విభాగాన్ని ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు. నేరాల అదుపునకు ప్రజల సహకారం అవసమన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో చాలావరకు నేరాలు తగ్గాయని.. కార్యాలయాలు, ఇండ్లల్లో కూడా సీపీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీపీ కోరారు. కార్యక్రమంలో శంషాబాద్ జోన్ డీసీపీ ప్రకాశ్రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్కుమార్, ఇన్స్పెక్టర్ కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
శంషాబాద్, జూలై 6 : ఆధునికతతో పాటు సమాజంలో పలు సైబర్ నేరాలు ప్రజలకు, పోలీసులకు సవాళ్లుగా మారాయని, వాటిని ఎదుర్కొనేందుకు సమిష్టి సహకారం, అవగాహన ముఖ్యమని శంషాబాద్ ఆర్జీఐఏ ఏసీపీ భాస్కర్ తెలిపారు. మంగళవారం శంషాబాద్ ఎయిర్పోర్టు జీఎంఆర్ కాన్ఫరెన్స్హాలులో ఎయిర్పోర్టు ఎంప్లాయిస్కు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి శంషాబాద్ ఆర్జీఐఏ ఏసీపీ భాస్కర్, సీఐ విజయ్కుమార్తో పాటు పలువురు హాజరయ్యారు.
సైబర్ నేరాలపై చైతన్యం కలిగించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ఏసీపీ భాస్కర్ మాట్లాడుతూ మారుతున్న మానవజీవన విధానంలో పలు సైబర్ నేరాలకు పాల్పడే మోసగాళ్లు అధికమయ్యారని వివరించారు. అందులో ఆర్థికపరమైనవి, బ్యాంకింగ్, గోల్డ్, కిడ్నాప్లు చోటుచేసు కుంటున్నాయని తెలిపారు. వాటిని ఎదురించాలంటే సాంకేతికత, వివేకం జోడించి సైబర్నేరాలను అదుపుచేయవచ్చని సూచించారు.