సిటీబ్యూరో, సెప్టెంబర్ 26(నమస్తే తెలంగాణ) : సివిల్ సర్వీస్కు సన్నద్దమవుతున్న వారిని ప్రోత్సహిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్. 2020 సివిల్స్ పరీక్షలో 761మంది అభ్యర్థులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ పోస్టుల ఫలితాలు వెల్లడించిన విషయం తెలిసిందే. అందులో 131మంది అభ్యర్థులు మహేశ్భగవత్ బృందంతో శిక్షణ పొందిన వారు ఉన్నారు.
ఢిల్లీకి చెందిన ఇద్దరు సోదరీలు అంకిత్జైన్(3), వైశాలి జైన్ (21), ఆంధ్రప్రదేశ్కు చెందిన సోదరులు రాలపల్లి జగత్ సాయి(32), రాలపల్లి వసంత్కుమార్(170), తెలంగాణ టాపర్ పి.శ్రీజ(20) తదితరులు శిక్షణ తీసుకున్న వారిలో ఉన్నారని సీపీ తెలిపారు. ఏడేండ్లుగా సివిల్స్కు సిద్ధమయ్యే వారికి పర్సనాల్లీ టెస్ట్(ఇంటర్వ్యూ) కు సంబంధించిన సలహాలు, సూచనలు ఇస్తున్నామని, తమ వద్ద శిక్షణ పొందిన వారు ఇప్పటి వరకు వెయ్యి మంది సివిల్స్కు ఎంపికయ్యారన్నారు. వీళ్లందరితో వాట్సాప్ గ్రూప్ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రెండు తెలుగు రాష్ర్టాలే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరాఖండ్, బిహార్, అస్సాం, ఒడిస్సా, జమ్మూ కాశ్మీర్, పశ్చిమ బెంగాల్కు చెందిన వారు తమ గ్రూప్లో ఉన్నారని వివరించారు.