హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. బషీర్బాగ్లోని కమిషనర్ కార్యాలయంలోని ఐదు అంతస్తుల్లో సీపీ పర్యటించారు. కరోనాను అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉద్యోగులకు పలు కీలక సూచనలు చేశారు. సీపీ ఆనంద్ వెంట అడిషనల్ సీపీ డీఎస్ చౌహాన్, డీసీపీ అడ్మిన్ సునీతా రెడ్డి ఉన్నారు.
ప్రతి అంతస్తులో పర్యటించిన సీపీ.. ప్రతి గదిలో వెంటిలేషన్ ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఫ్లోర్లో పరిశుభ్రత పాటించాలని సూచించారు. ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. గుంపులు గుంపులుగా గుమిగూడి టీ తాగడం, లంచ్ చేయడం వంటివి మానుకోవాలని సూచించారు. ఇక వాష్రూమ్, టాయిలెట్లను శుభ్రంగా ఉంచాలన్నారు. మాస్కులకు, శానిటైజర్లతో పాటు ఇతర మౌలిక సదుపాయాలకు త్వరలోనే నిధులు మంజూరు చేస్తామన్నారు. ప్రతి ఉద్యోగికి మాస్కులు, శానిటైజర్ అందజేస్తామన్నారు.
సోషల్ మీడియా వింగ్, కమాండ్ కంట్రోల్ సెంటర్, ట్రాఫిక్ కమాండ్ సెంటర్లను సీపీ ఆనంద్ పరిశీలించారు. ప్రస్తుతం ఎన్ని సీసీటీవీ కెమెరాలు పని చేస్తున్నాయని ఉద్యోగులను ఆరా తీశారు. ఐటీ ప్రాజెక్టుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ సీవీ ఆనంద్ సూచించారు.