చార్మినార్, జూలై 11: మొహర్రం సంతాప దినం సందర్భంగా పూర్తిస్థాయిలో ఏర్పాట్లను త్వరలోనే చేపట్టనున్నామని నగర పోలీస్ కమిషనర్ సీఎం ఆనంద్ తెలిపారు. మంగళవారం సాలార్జంగ్ మ్యూజియంలో వివిధ షియా కమ్యూనిటీ ప్రతినిధులు, అషూర్ ఖానా నిర్వహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పోలీసు కమిషనర్ మాట్లాడుతూ.. ఈనెల 29 నుంచి మొహర్రం సంతాప దినాలు మొదలవుతాయని తెలిపారు. నెలరోజుల పాటు కొనసాగే ఈ సంతాప దినాల్లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టనున్నామని తెలిపారు.
అదనంగా మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మొహర్రం పదో రోజున నిర్వహించే మాతం రూట్ మ్యాప్ ప్రకారమే అలంల ఊరేగింపు కొనసాగనున్నదని తెలిపారు. వివిధ శాఖల సమన్వయంతో ఎలాంటి అసౌకర్యాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో యాకుత్పుర ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, ఎమ్మెల్సీ రియాజ్ ఉల్ అఫందీ, జాయింట్ సీపీ శ్రీనివాస్, దక్షిణ మండల డీసీపీ సాయి చైతన్యతోపాటు సౌత్ ఈస్ట్ డీసీపీ రూపేష్, సౌత్ వెస్ట్ బీసీపీ కిరణ్ ప్రభాకర్, ట్రాఫిక్ డీసీపీ అశోక్కుమార్, చార్మినార్ జోనల్ కమిషనర్ వెంకన్న, అదనపు డీసీపీలు ఆనంద్, షేక్ జహంగీర్ (ఫలక్నుమా ఇంచార్జ్ ఏసీపీ), చార్మినార్, మీర్చౌక్ ఏసీపీలు రుద్ర భాస్కర్, దామోధర్రెడ్డితోపాటు పలు పోలీస్ స్టేషన్లకు చెందిన ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు..