సిటీబ్యూరో, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ): ఏపీ నుంచి వివిధ రాష్ర్టాలకు గంజాయిని సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, జాయింట్ సీపీలు ఏఆర్ శ్రీనివాస్, ఎం.రమేశ్, టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం జిల్లా నర్సింపట్నంకు చెందిన వనపల్లి నాగసాయి క్యాటరింగ్ చేస్తూ గంజాయి స్మగ్లింగ్ నిర్వహిస్తుంటాడు.
వైజాగ్ ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయిని అక్రమంగా పండించే రైతులు, గంజాయి సరఫరాదారులతో ఒప్పందాలు చేసుకుంటాడు. వివిధ రాష్ర్టాల్లో పరిచయాలున్న గంజాయి స్మగ్లర్లతో మాట్లాడి వాళ్లకు గంజాయిని పంపిస్తూ గంజాయి డాన్గా చెలమణి అవుతున్నాడు. తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర్ప్రదేశ్ తదితర రాష్ర్టాలకు గంజాయిని సరఫరా చేస్తుంటాడు. ఇటీవల అంబర్పేట, మలక్పేట పోలీసులు గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసినప్పుడు తాము నాగసాయి నుంచి కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడించారు.
దీంతో టాస్క్ఫోర్స్ నార్త్జోన్ ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వర్రావు బృందంతో పాటు ఈస్ట్జోన్ పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఎంజీబీఎస్ వద్ద నారాయణఖేడ్కు చెందిన ప్రేమ్సింగ్కు గంజాయి సరఫరా చేసేందుకు నాగసాయి వచ్చినట్లు అందింది. దీంతో అఫ్జల్గంజ్ పోలీసులతో కలిసి ఆటో పార్కింగ్ వద్ద గంజాయితో ఎదురు చూస్తున్న నాగసాయిని అరెస్ట్ చేసి 40కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా గత నెల రోజులుగా గంజాయి విక్రయాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ నగరంలో 82 కేసులు నమోదు చేసి, 128 మందిని అరెస్ట్ చేశామని సీపీ తెలిపారు. 1500 కేజీల గంజాయిని సీజ్ చేయడంతో పాటు గంజాయి విక్రయాలతో సంబంధమున్న 239 మంది పేర్లు బయటకు వచ్చాయని అందులో కొందరిని అరెస్ట్ చేశామని, మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. 23 మందిపై పీడీ యాక్టు నమోదుచేయడంతో పాటు మరో 13 మందిపై పీడీ యాక్టుకు సన్నాహాలు చేస్తున్నామని వివరించారు.
సమాచారం అందిన వారిలో గంజాయి అక్రమ దందా చేయడానికి 60 మంది అలవాటు పడ్డారని, మరో 35 మంది సీజనల్గా విక్రయాలు సాగిస్తున్నట్లు తేలిందన్నారు. ప్రధానంగా 17మంది గంజాయి రవాణా చేసేవారిని గుర్తించి అందులో 8 మందిని అరెస్ట్ చేశామని మిగతా వారి కోసం గాలిస్తున్నామన్నారు. ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దులు విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి మహారాష్ట్రకు హైదరాబాద్ మీదుగా ఈ గంజాయి స్మగ్లింగ్ జరుగుతుందన్నారు. గంజాయి వాడుతున్న 600మందిని గుర్తించామని వారికి కౌన్సెలింగ్ నిర్వహించామని, అందులో కొందరు విద్యార్థులు కూడా ఉన్నారని తెలిపారు.