సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ): చికిత్స పొందుతున్న క్యాన్సర్ రోగులకు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన చేసిన 9 ఏండ్ల బాలికను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ శుక్రవారం జ్ఞాపిక అందజేసి అభినందించారు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కు చెందిన అక్షర తండ్రి సతీశ్ కొవిడ్ సమయంలో ఎంఎన్జే క్యా న్సర్ దవాఖానలో చికిత్స పొందుతున్న రోగులకు తోచిన సాయం చేశాడు. ఈ క్రమంలో అక్షర కూడా తండ్రి వెంట వెళ్లి అక్కడున్న చిన్నారులతో మాట్లాడేది. చికిత్స పొందుతున్న పిల్లలకు ఏదో వ్యాపకం ఉంటే త్వరగా కోలుకుంటారని ఆలోచించింది. ఈ క్రమంలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని ఆలోచించి.. తన స్నేహితులు, అపార్ట్మెంట్ వాసుల నుంచి వెయ్యికి పైగా తెలుగు, ఇంగ్లిష్, హిందీకి చెందిన పుస్తకాలు డ్రాయింగ్ బుక్కులను సేకరించింది. ఈ క్రమంలో ఆ చిన్నారి గవర్నర్, ప్రధానికి కూడా లేఖలు రాసింది. ప్రధాన మంత్రి నుంచి అక్షరను అభినందిస్తూ లేఖలు వచ్చాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్ సీపీ విద్యార్థులు, చిన్నారులను ఉద్దేశించి చేస్తున్న ప్రసంగాలను చూసిన అక్షర శుక్రవారం ఆయనను కలిసింది. ఆమె చేస్తున్న ప్రయత్నాన్ని వివరించగా సీపీ అభినందించారు. చిన్నారి ఏర్పాటు చేయబోయే గ్రంథాలయం కోసం ఎన్ఎంజే క్యాన్సర్ వైద్యశాలలో ఓ గదిని కేటాయించింది. త్వరలో ఈ లైబ్రరీ ప్రారంభం కానున్నది.