సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): 100 శాతం కొవిడ్ వ్యాక్సిన్ను అందించేందుకు గ్రేటర్ హైదరాబాద్లో చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతున్నది. మూడో రోజైన బుధవారం 28,181 మందికి మొదటి డోస్ టీకా ఇవ్వగా, 5537 వేల మందికి రెండో డోస్ ఇచ్చారు. ఇప్పటి వరకు 947 కాలనీల్లో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి కాగా అభినందన సర్టిఫికెట్లను అందజేశారు.
ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే గ్రేటర్లోని 4,846 కాలనీలు, బస్తీల్లో 175 సంచార వాహనాల ద్వారా టీకాలు వేస్తుండగా.. ఇక మిగిలిన వారు టీకాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకోసం కొత్తగా 594 వాహనాలను సమకూర్చారు. కరోనా నియంత్రణలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని..టీకా తీసుకొని మహమ్మారి నుంచి రక్షణ పొందాలని కోరుతున్నారు. అంతేకాక వృద్ధులుంటే ఈ వాహనాల ద్వారా టీకా కేంద్రానికి తీసుకెళ్తున్నారు. ఆ తర్వాత తిరిగి ఇంటి వద్ద దింపేస్తున్నారు.
చాంద్రాయణగుట్టలోని ఉప్పుగూడ పరివార్ టౌన్ షిప్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ను బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సందర్శించారు. ప్రభుత్వం కల్పించిన ఈ సదావకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వ్యాక్సినేషన్ డ్రైవ్లో ప్రజాప్రతినిధులు పాల్గొని హైదరాబాద్ను 100 శాతం వ్యాక్సినేటెడ్ నగరంగా మార్చాలని సూచించారు. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో 947 కాలనీల్లో 100 శాతం వ్యాక్సినేషన్ డ్రైవ్ పూర్తి అయ్యిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ పాల్గొన్నారు.