కరోనాను పూర్తిస్థాయిలో నియంత్రించడమే లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జీహెచ్ఎంసీ తలపెట్టిన వందశాతం వ్యాక్సినేషన్ కార్యక్రమం సోమవారం అట్టహాసంగా ప్రారంభమైంది. పదిరోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో భాగంగా నగరంలోని 4,846 కాలనీల్లో 175 సంచార వాహనాలను వినియోగించి సిబ్బంది టీకాలు వేస్తున్నారు. ఇప్పటికే 50 లక్షల మందికి టీకాలు వేయగా మిగిలిన వారిని ఇంటింటికీ తిరిగి జీహెచ్ఎంసీ సిబ్బంది గుర్తిస్తున్నారు. ఎవరైనా టీకాలు తీసుకోని వారు ఉంటే వారికి టీకా వేసే సమయం.. ఎక్కడ వేస్తారో సమాచారమిస్తున్నారు. తొలిరోజు 26,892 మందికి టీకా వేశారు. సంపూర్ణంగా టీకా తీసుకున్న 264 కాలనీలకు ప్రశంసాపత్రాలను అందజే శారు. ఇదిలా ఉంటే ఖైరతాబాద్లోని సీఐబీ కాలనీలో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని సీఎస్ సోమేశ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో 100% వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. సికింద్రాబాద్, కొండాపూర్, మియాపూర్లలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాలను హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు సందర్శించారు. టీకాలు వేస్తున్న తీరును అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు వందశాతం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. కీలక సర్కిళ్లకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ కమిషనర్ లోకేశ్కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా చేపట్టిన ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ సోమవారం నగర వ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ద్వారా 18 ఏండ్లకు పైబడిన అర్హులందరికీ వంద శాతం వ్యాక్సిన్ అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నగరంలో దాదాపు 50 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. ఇండ్లలో ఉండే వృద్ధులు, మహిళలు, ఇతరులకు టీకాలు వేసి.. 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసేలా సోమవారం నుంచి పది రోజుల పాటు ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్కు శ్రీకారం చుట్టారు.
ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్కు 175 సంచార కొవిడ్ వ్యాక్సిన్ వాహనాలను ఉపయోగిస్తున్నారు. నగరంలోని 4,846 కాలనీలు, బస్తీలకు ఈ మొబైల్ వాహనాలు వెళ్తాయి. ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేయించుకోని వారిని గుర్తించి టీకా వేస్తారు. జీహెచ్ఎంసీ సిబ్బంది అంతకు ముందే ఆయా కాలనీలు, బస్తీల్లోని ప్రతి ఇంటింటినీ సందర్శిస్తారు. ప్రతి ఇంటిలో అర్హులైన సభ్యులు వ్యాక్సిన్ తీసుకున్నారా.. లేదా.. అన్న వివరాలు తెలుసుకుంటారు. ఆ ఇంట్లోని వారంతా వ్యాక్సిన్ తీసుకుంటే, ఆ ఇంటిలో ఉంటున్న వారంతా వ్యాక్సిన్ తీసుకున్నారు.. అని తెలిపే స్టికర్ను ఇంటికి అతికిస్తారు. ఎవరైనా మిగిలితే వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు.. సమయం, తేదీని తెలిపే స్లీప్ను అందజేస్తారు. అనంతరం.. ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ వేయించేందుకు సహకరించిన ఆయా కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధులకు ప్రశంసా పత్రాన్ని అందజేస్తారు.
గ్రేటర్ హైదరాబాద్లో జరుగుతున్న ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా రాజేంద్రనగర్ సర్కిల్ సన్రైజ్ కాలనీలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ నివాసానికి జీహెచ్ఎంసీ బృందం వెళ్లింది. ఆ ఇంట్లో ఉంటున్న వారందరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు గుర్తించారు ఆ తర్వాత ‘ ఈ నివాసంలోని అర్హులైన వారందరూ వ్యాక్సిన్ తీసుకున్నారు’.. అని సూచించే స్టిక్కర్ను జీహెచ్ఎంసీ సిబ్బంది ఆ ఇంటికి అతికించారు.
సిటీబ్యూరో, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ ) : నగరంలో చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులను పలు కీలక సరిళ్లకు ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఈ మేరకు కమిషనర్ లోకేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. చార్మినార్ సరిల్కు అడిషనల్ కమిషనర్ సంతోష్, చాంద్రాయణగుట్ట సరిల్కు విజయలక్ష్మి, హయత్నగర్ సరిల్కు యాదగిరిరావు, సరూర్నగర్ సరిల్కు పంకజ, కుత్బుల్లాపూర్ సరిల్కు ప్రియాంక అలా, అల్వాల్ సరిల్కు జె.శంకరయ్య, ముషీరాబాద్ సరిల్కు వి.కృష్ణ, అంబర్పేట్ సరిల్కు జయరాజ్ కెనడి, చందానగర్ సరిల్కు చీఫ్ ఇంజినీర్ దేవానంద్, మెహిదీపట్నం సరిల్కు సీఈ జియాఉద్దీన్, కార్వాన్ సరిల్కు సీఈ వసంతను నోడల్ అధికారులుగా నియమిస్తూ ఆదేశాలు జారీచేశారు. ఈ అధికారులు తమకు కేటాయించిన సరిళ్లలోని కాలనీల్లో నిర్వహించే వ్యాక్సినేషన్ కార్యక్రమాలకు హాజరై వంద శాతం వ్యాక్సినేషన్ జరిగేలా పర్యవేక్షిస్తారని తెలిపారు.
నగర వ్యాప్తంగా ప్రారంభమైన ప్రత్యేక కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఖైరతాబాద్లోని సీఐబీ కాలనీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పరిశీలించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజివి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, జోనల్ కమిషనర్ ప్రావీణ్య కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో ఇప్పటి వరకు ఏ మెట్రో నగరంలో కూడా 100 శాతం అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమాన్నిచేపట్టలేదన్నారు. హైదరాబాద్లో మాత్రమే ప్రారంభించామని తెలిపారు. నగరంలోని 4,864 కాలనీల్లో రానున్న పది, పదిహేను రోజుల్లో అందరికీ వ్యాక్సిన్ పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లంతా పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మూడవ విడత కరోనా వేవ్ వచ్చే అవకాశం లేదని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదురోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో 27,000 బెడ్స్ సిద్ధంగా ఉన్నాయని, ఎనిమిది మెడికల్ కాలేజీల్లో బెడ్స్ సంఖ్యను పెంచామని చెప్పారు. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలనే కృత నిశ్చయంతో సీఎం కేసీఆర్ ఉన్నారని సీఎస్ వివరించారు.
కొండాపూర్/మియాపూర్, ఆగస్టు 23 : కరోనా నియంత్రణ కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ వంద శాతం లక్ష్యాన్ని చేరుకోవాలని, అత్యంత ప్రాధాన్యతగా ఈ ప్రక్రియను చేపట్టాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్కుమార్ పేర్కొన్నారు. కరోనా కట్టడికి చేపట్టిన మొబైల్ వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా శేరిలింగంపల్లి, చందానగర్ సర్కిళ్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఇంటింటికి అవగాహన సర్వేను సోమవారం కలెక్టర్ అమయ్కుమార్ పరిశీలించారు. కొండాపూర్ డివిజన్ వసంత వ్యాలీలో నిర్వహించిన సర్వేను వెస్ట్జోన్ జడ్సీ రవికిరణ్, డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మీలతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంటింటి సర్వేలో భాగంగా వ్యాక్సినేషన్ పూర్తయిన ఇండ్లను గుర్తించి స్టిక్కర్ అతికించాలన్నారు. కరోనా నివారణకు వ్యాక్సిన్ ఒక్కటే ప్రధాన మార్గమని, ప్రజలకు అవగాహన కల్పించి స్వచ్ఛందంగా వారు టీకా తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యాక్సిన్ను వంద శాతం పూర్తిచేసి, జోన్ మొదటి స్థానంలో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీలు వెంకన్న, సుధాంశ్, సర్కిల్ ఏఎంహెచ్ఓ డాక్టర్ రవి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదిలాఉండగా, వ్యాక్సినేషన్ కార్యక్రమంలో సోమవారం 26,892 మందికి పైగా టీకా తీసుకున్నారు. అదే విధంగా, వంద శాతం వ్యాక్సిన్ తీసుకున్న 264 కాలనీలను జీహెచ్ఎంసీ గుర్తించింది. ఆయా కాలనీలను అభినందిస్తూ ప్రశంసా పత్రాలను కూడా జీహెచ్ఎంసీ అధికారులు అందజేశారు.
కంటోన్మెంట్, ఆగస్టు 23: అపోహలు లేకుండా ప్రతి ఒక్కరూ నిర్భయంగా కరోనా టీకా తీసుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్ పిలుపునిచ్చారు. కొవిడ్ తగ్గిందని అశ్రద్ధ చేయవద్దని, మాస్కులు ధరించాలని ప్రజలకు సూచించారు. సోమవారం నుంచి ప్రారంభమైన వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా కంటోన్మెంట్ పరిధిలోని రసూల్పురా ఇందిరమ్మనగర్లో బోర్డు అధికారులు, ఆరోగ్య సిబ్బంది, ఆశ వర్కర్లతో కలిసి కలెక్టర్ శర్మన్ పాల్గొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారితో పాటు తీసుకోని వారి వివరాలను నమోదు చేసుకుంటూ, వ్యాక్సిన్ కేంద్రాల వివరాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ తాసీల్దార్ బాల శంకర్, కంటోన్మెంట్ బోర్డు డిప్యూటీ సీఈఓ విజయ్కుమార్ బాలన్ నాయర్, ఇంజినీర్ బాలకృష్ణ, అధికారులు దేవేందర్, డాక్టర్ అరుణ్ కుమార్, వైద్య సిబ్బంది బాలమణి, షీబా రాణి, ఆశ వర్కర్లు రేణుక, మీనా, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.