కరోనా థర్డ్ వేవ్ రాకను సమర్థవంతంగా అడ్డుకునేందుకు ప్రభుత్వం కసరత్తును
తీవ్రతరం చేసింది. రాబోయే పదిహేనురోజుల్లో వందశాతం సింగిల్ డోస్ వ్యాక్సినేషన్ను పూర్తి చేయాలని గ్రేటర్ హైదరాబాద్ అధికారులకు లక్ష్యం విధించింది. ఇందులో భాగంగానే.. 18 ఏండ్లు పైబడిన వారికి ఇప్పటికే 90 శాతం మందికి టీకాలు ఇచ్చిన నగర పాలనా యంత్రాంగం.. మిగిలిన పదిశాతం మందిపై దృష్టి పెట్టింది. ఇంటింటికీ తిరిగి సర్వే చేసి టీకాలు వేసుకోని వారిని గుర్తించనుంది సెప్టెంబర్ 9 కల్లా వారికి మొదటి డోసు పూర్తి చేయాలని నిర్ణయించింది. అందుకోసం జీహెచ్ఎంసీలోని 4846 కాలనీలు, బస్తీలు, కంటోన్మెంట్ జోన్లోని 360 ప్రాంతాల్లో సోమవారం నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. అంతేకాకుండా మొబైల్ వ్యాక్సిన్ వ్యాన్ల సంఖ్యను జీహెచ్ఎంసీలో 150కి, కంటోన్మెంట్లో 25కు పెంచనున్నారు. టీకా కార్యక్రమాన్ని ప్రోత్సహించే దిశగా.. ఇంట్లోని వారందరూ వ్యాక్సిన్ వేయించుకుంటే ఆ గృహానికి ‘పూర్తిస్తాయి వ్యాక్సినేషన్’.. కాలనీవాసులందరూ వేయించుకుంటే వ్యాక్సినేటెడ్ కాలనీలుగా ప్రకటించి సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నారు.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): వంద శాతం వ్యాక్సినేషన్ దిశగా గ్రేటర్ దూసుకుపోతున్నది. 18 ఏండ్లు ఆపై వయసున్న వారికి ఇప్పటికే 90 శాతం మందికి టీకాలు వేసిన యంత్రాంగం… మిగిలిన పది శాతం ఎక్కడున్నారనే దానిపై అన్వేషణ మొదలుపెట్టింది. ఇంటింటి సర్వే ద్వారా వారందరినీ గుర్తించి… వచ్చే నెల 9కల్లా ఒకటో డోస్ వంద శాతం పూర్తి చేయాలనే లక్ష్యాన్ని ఎంచుకుంది. గ్రేటర్లోని అన్ని సర్కిళ్లలో శనివారమే ఇంటింటి సర్వే ద్వారా వ్యాక్సిన్ వేయించుకోని వారి వివరాలను సేకరించే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తికి తీసుకోవాల్సిన చర్యలపై శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ కూడా సమీక్ష నిర్వహించారు.
50 స్టాటిక్ వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా రోజుకు సుమారు 15వేల మందికి టీకాలు వేస్తున్నారు. దీంతో పాటు 90 మొబైల్ వ్యాన్ల ద్వారా రోజుకు దాదాపు 20వేల మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రేటర్ పరిధిలో 90 శాతం మందికి మొదటి డోస్ అందింది. హైదరాబాద్ జిల్లాలోనే ఏకంగా 97 శాతం మంది, గ్రేటర్ పరిధిలోని రంగారెడ్డి 128 శాతం, మేడ్చల్ 63 శాతం, సంగారెడ్డిలో 93 శాతం మందికి మొదటి డోస్ వ్యాక్సిన్ అందింది. మిగిలిన పది శాతాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఇంటింటి సర్వేలో భాగంగా ఇంట్లో ఉన్న వారంతా వ్యాక్సినేషన్ చేయించుకున్నట్లయితే ఆ ఇంటికి ‘పూర్తిస్థాయి వ్యాక్సినేషన్’ అనే స్టిక్కర్ కూడా అంటించనున్నారు. అంతే కాదు వంద శాతం వ్యాక్సినేటెడ్ కాలనీగా కాలనీ సంక్షేమ సంఘానికి సర్టిఫికెట్ ప్రదానం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 90 మొబైల్ వ్యాన్ల సంఖ్యను 150కి పెంచనున్నారు. 4846 కాలనీలు, మురికివాడలు, బస్తీల్లో లక్ష్యం చేరుకునేందుకు సోమవారం నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టేందుకు నిర్ణయించారు.
మేడ్చల్, ఆగస్టు21(నమస్తే తెలంగాణ): ప్రతి ఒక్కరికీ కొవిడ్ టీకాలు వేసి జిల్లా వ్యాప్తంగా వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎస్. హరీశ్ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపుహాల్లో శనివారం జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావుతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.