సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): వందశాతం వాక్సినేషన్ పూర్తి దిశగా గ్రేటర్ హైదరాబాద్ దూసుకుపోతున్నది.18 ఏండ్లకు పైబడిన వారికి 100శాతం కొవిడ్ టీకా పూర్తి చేసేందుకు గ్రేటర్లో చేపట్టిన ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం రెండో రోజూ మంగళవారం ముమ్మరంగా కొనసాగింది. దాదాపు 175 వ్యాక్సినేషన్ బృందాలు తమకు కేటాయించిన కాలనీలకు ఉదయం 8గంటలకే చేరుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సోమవారంతో పోల్చితే మంగళవారం టీకాల పంపిణీ కార్యక్రమం మరింత ఉత్సాహంగా కొనసాగింది.472 కాలనీల్లో 30571మందికి వ్యాక్సిన్ వేశారు. నగరానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు తమ పరిధిలోని వ్యాక్సిన్ కేంద్రాలను సందర్శించి ఆ ప్రక్రియను పరిశీలించారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి హయత్నగర్ సరిల్లోని జడ్జీకాలనీ, సహారా ఎస్టేట్స్ తదితర కాలనీలను సందర్శించి ప్రతిఒకరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఉప్పల్,అంబర్పేట ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే సుభాష్రెడ్డి,వెంకటేశ్ తమ పరిధిలోని పలు కాలనీలను సందర్శించి వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు.
వందశాతం వ్యాక్సినేషన్ డ్రైవ్ను విజయవంతం చేసేందుకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పలు వ్యాక్సినేషన్ డ్రైవ్ కేంద్రాలను సందర్శించారు. బంజారాహిల్స్ ఫొటో గ్రాఫర్స్ కాలనీలో 100శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయిన సందర్భంగా ఆమె అభినందిస్తూ సర్టిఫికెట్ను అందజేశారు. వేమిరెడ్డి కాలనీలో వ్యాక్సినేషన్ ప్రక్రియను, మెహిదీపట్నం నానల్నగర్లో ఇంటింటికీ వ్యాక్సినేషన్ సర్వేను దగ్గరుండి పరిశీలించారు. అయోధ్యనగర్ మజీద్ వద్ద టీకా సెంటర్ను మేయర్ సందర్శించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్లో 100 శాతం వ్యాక్సిన్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నగర ప్రజలందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని మేయర్ విజ్ఞప్తి చేశారు.