శేరిలింగంపల్లి, అక్టోబర్ 12 : నగరంలో మెగా వ్యాక్సినేషన్ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. ఖాజాగూడలోని జీహెచ్ఎంసీ క్రీడా స్టేడియంలో కేర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ, తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గంటల తరబడి నిరీక్షణ, తోపులాటలు, ఇతర ఇబ్బందులు ఏమాత్రం లేకుండా కార్పొరేట్ తరహాలో ఈ వ్యాక్సినేషన్ కేంద్రంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రజలకు టీకాలు వేయనున్నారు. కరోనా వ్యాక్సిన్ను ప్రజలకు చేరువ చేసేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ మెగా వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మంగళవారం ప్రారంభించారు.
గత మే నెలలో పాట్నా నగరంలో కేర్ ఇండియా స్వచ్ఛంద సంస్థ అక్కడి ప్రభుత్వ సహకారంతో మొదటిసారిగా మెగా వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అది విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా 13రాష్ర్టాల్లో 44 మెగా వ్యాక్సినేషన్ కేంద్రాలు అందుబాటులోకి తెచ్చారు. బెంగళూర్, పాట్నాల్లోని కేంద్రాల్లో 24 గంటల సేవలు అందుబాటులో ఉండగా, టీకా ఎక్స్ప్రెస్ పేరుతో ఇంటి వద్ద కూడా టీకాలు ఇస్తున్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే 2.80కోట్ల మందికి రెండు డోసుల వ్యాక్సిన్ వేసినట్లు సీఎస్ సోమేశ్కుమార్ తెలిపారు. మెగా వ్యాక్సినేషన్ కేంద్రం ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు 2.2 కోట్ల మందికి మొదటి డోస్, 2.8 కోట్ల మందికి రెండవ డోస్ వ్యాక్సిన్ పూర్తయిందని అన్నారు. ఈ నెలలో కోటి డోసులు సరఫరా అందించనున్నట్లు చెప్పారు. తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ మెగా వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఎఎం రిజ్వీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమెయ్కుమార్, డీహెచ్ శ్రీనివాస రావు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గంగాధర్, వెస్ట్జోన్ కమిషనర్ రవికిరణ్, తహసీల్దార్ వంశీమోహన్, డీసీ వెంకన్న, డీసీపీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లు మొదటి, రెండవ డోసులు అందుబాటులో ఉంచారు.
ఆధార్ కార్డు చూపించి ఎవరైనా ఇక్కడ వ్యాక్సిన్ ఉచితంగా తీసుకోవచ్చు.
వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకంగా రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
మహిళల కోసం రెండు ప్రత్యేక పింక్ కౌంటర్లు ఉన్నాయి.
వృద్ధులకు, పురుషులకు వేర్వేరుగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.
వ్యాక్సిన్ తీసుకున్నవారికి ఇబ్బందులు ఎదురైతే వైద్య సేవలకు ప్రత్యేక కౌంటర్ ఉంది.
టీకాల కోసం ప్రజలు వేచి ఉండేందుకు ప్రత్యేకంగా సీటింగ్ కలిగిన కారిడార్లు ఉన్నాయి.
ఈ మెగా వ్యాక్సినేషన్ కేంద్రంలో మహిళలకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. నేను చాలా సులువుగా ఈ ప్రత్యేక కౌంటర్లో టీకా రెండో డోసు తీసుకున్నాను. మొదటి డోస్ సమయంలో తోపులాటల మధ్య చాలా ఇబ్బంది పడ్డాను. ఇపుడు ఆ కష్టాలు లేవు. ప్రభుత్వం మంచి ఆలోచనతో ఈ కేంద్రం ఏర్పాటు చేసినందుకు ఆనందంగా ఉంది. – రాంతులసమ్మ, మణికొండ
మాది జార్ఖండ్ రాష్ట్రం. హైదరాబాద్కు వలస వచ్చి భవన నిర్మాణ పనుల్లో కూలీ పని చేస్తున్నాను. కొవిడ్ టీకా కోసం మా రాష్ట్రంలో ప్రయత్నించినా దొరకలేదు. హైదరాబాద్లో చాలా సులభంగా టీకా దొరికింది. నేను పని చేసే సంస్థ ద్వారా ఇక్కడికి వచ్చి తోపులాటలు, భారీ క్యూలు లేకుండానే టీకా తీసుకున్నాను. – షాహిద్ ఆఫ్రిది, భవన నిర్మాణ కార్మికుడు