కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ తీవ్రమవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో అధికారులు అప్రమత్తమయ్యారు. కొవిడ్-19 నిబంధనలను ఖచ్చితంగా పాటించడమే కాకుండా మెట్రో రైలులో ప్రయాణించే వారిని నిరంతరం అప్రమత్తం చేస్తున్నారు.. మెట్రోలో ప్రయాణికులు నిబంధనలు పాటించాలంటూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి మెట్రో రైలును ప్రతిరోజు శానిటైజ్ చేయడంతో పాటు మెట్రో స్టేషన్లలో పనిచేసే ఉద్యోగులు మాస్క్ ధరించడం, థర్మల్ స్క్రీనింగ్ చేయడం, భౌతిక దూరం, శానిటైజేషన్ వంటివి ప్రతి ఒక్కరూ పాటిస్తున్నారా? లేదా అన్న విషయాన్ని పరిశీలిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మెట్రోలో ప్రయాణికుల సంఖ్య తగ్గకుండా మెట్రో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మూడు కారిడార్లలోని మెట్రో స్టేషన్లతో పాటు రద్దీ అధికంగా ఉండే ఇంటర్చేంజ్ మెట్రో స్టేషన్లలో కరోనా వ్యాప్తి చెందడకుండా తరచూ శానిటైజేషన్ చేస్తూ ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్నారు.
కొవిడ్-19 నిబంధలను ఖచ్చితంగా పాటించే చర్యలతో పాటు పలువురు ప్రయాణికులతో కలిసి మెట్రో రైలు, మెట్రో స్టేషన్లలో ప్లకార్డులు పట్టుకొని కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. మాస్క్ లేకుంటే భద్రత లేనట్టే-ఎల్లప్పుడూ మాస్క్ను ధరించండి. బహిరంగ ప్రదేశాల్లో మీ ముక్కు మరియు నోరును పూర్తిగా మాస్క్తో కవర్ చేయండి అంటూ ప్లకార్డులను మెట్రో ప్రాంగణాల్లో ప్రదర్శిస్తున్నారు. మీ భద్రత మా ప్రాధాన్యత.. మా లక్ష్యం.. మీకు జరిమానా విధించడం కాదు… దయచేసి ఎల్లప్పుడూ మాస్క్లు ధరించండి… అంటూ మెట్రో ఉద్యోగులు ప్లకార్డులతో ప్రయాణికులకు కరోనాపై అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. ప్రయాణికులు ఎవరికి వారు కొవిడ్ నిబంధనలు పాటిస్తే కరోనాకు దూరంగా ఉండవచ్చని, మెట్రోలో హాయిగా ప్రయాణం చేయవచ్చని, లేదంటే కరోనా తీవ్రమైతే పరిస్థితులు మరోలా ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదంతా ప్రయాణికుల భద్రత కోసమేనని వారు గుర్తించి, ఎవరికి వారు జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణం చేయాలని మెట్రో అధికారులు కోరారు. మెట్రో స్టేషన్లు, మెట్రో రైళ్లలో సిబ్బంది ప్రయాణికుల భద్రత కోసం చేస్తున్న చర్యల పట్ల పలువురు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.