వ్యవసాయ యూనివర్సిటీ , సెప్టెంబర్ 1: ఉద్యాన పంటల సాగుకు మన నేలలు, వాతావరణ పస్థితులు ఎంతో అనుకూలంగా ఉన్నాయని, ఇక్కడ పండించిన పంటలు మంచి పోషకాలు, చాలా రుచికరంగా ఉండటంవల్ల ఇతర దేశాల ప్రజలు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారని ది రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ అంబాసిడర్, డెసిగ్నెంట్ ఆఫ్ ఇండియా -2, ముఖ్య అతిథి డాక్టర్ టీవీ నాగేంద్రప్రసాద్ అన్నారు. శుక్రవారం ఉద్యాన కళాశాలలో ఉపకులపతి డా.నీరజా ప్రభాకర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ విఫణిలో ఉద్యాన వ్యవసాయ పోకడలపై అవగాహణ సదస్సు నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. దేశ అభివృద్ధిలో ఉద్యాన రంగం ఎంతో దోహదపడుతుందన్నారు. విద్యార్థులు ఇష్టపడి సివిల్స్ రాయాలనుకుంటే తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఉద్యాన వ్యవసాయ చదువులో కూడా ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంభించాలని, రైతులకు అవసరమైన ప్రయోగశాలలతో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటలీజెంట్ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉపకులపతి డా. నీరజా ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలానికి అనుగుణంగా విద్యార్థులకు అవసరమైన జ్ఞానాన్ని అందించే విధంగా, ఉద్యాన రైతులకు ఆర్థిక ప్రగతికి దోహదపడే విధంగా, అకడమిక్ కర్క్యూలం విశ్వవిద్యాలయం అందిస్తుందని తెలిపారు. విద్యార్థులకు ఉద్యాన రంగంలో అపారమైన అవకాశాలున్నాయని, వాటి అవసరానికి అనుగుణంగా స్టార్టప్లు ఏర్పర్చుకోవడానకి ముందుకు రావాలన్నారు. సొంత స్టార్టప్ల ఏర్పాటు కోసం అన్ని విధాలుగా విద్యార్థులకు విశ్వవిద్యాలయం అండగా ఉంటుందన్నారు. గతంలో ఇతర ప్రాంతాల నుంచి మనం దిగుమతి చేసుకునే వారమని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. అంతకు ముందు కజకిస్తాన్ అంబాసిడర్, మన పూర్వపు విద్యార్థి డా. టీవీ నాగేంద్రప్రసాద్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీజీ డీన్ డా. రాజశేఖర్, కళాశాల అసోసియేట్ డీన్ డా. చినా నాయక్, ఓఎస్ఏ డా. సాయికృష్ణ నిఖిల్, డా. కళాదర్ బాబు , ఇతర బోధనా, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.