లక్షల రూపాయల ఫీజుల మాట దేవుడెరుగు.. కొవిడ్ చికిత్స అందిస్తున్న కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు రోగి పరిస్థితి విషమించడంతో చేతులెత్తేస్తున్నాయి. ఇక తమ వల్ల కాదంటూ గాంధీకి పంపుతున్నాయి. దీంతో ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న దశలో గాంధీకి వచ్చే రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇలా మూడు రోజుల వ్యవధిలో 347 మందికి పైగా కొత్త రోగులు గాంధీకి చేరడంతో దవాఖానపై భారం పెరుగుతోంది. ముఖ్యంగా చివరి నిమిషంలో వచ్చే రోగులకు కచ్చితంగా ఆక్సిజన్ అందించడమో వెంటిలేటర్ అనివార్యం అవుతుండటంతో వైద్య సిబ్బంది నిస్సాహాయత వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రేయింబవళ్లు శ్రమిస్తున్న గాంధీ వైద్యులు, ఇతర సిబ్బందికి ఈ పరిణామం పెను సవాల్గా పరిణమిస్తున్నది. ఈ నేపథ్యంలో రోగుల పరిస్థితి విషమించే దాకా చూడకుండా ముందుగానే అప్రమత్తం కావాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్తో పాటు వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వాసుపత్రుల్లో అన్ని వసతులు, మెరుగైన వైద్య సేవలు ఉన్నందున ప్రజలు ఆదిలోనే ప్రభుత్వాసుపత్రులకు రావాలని కోరుతున్నారు.