హైదరాబాద్, జూలై 25(నమస్తే తెలంగాణ): కరోనా బాధితులకు ప్రాణ వాయువు సమస్య తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం మెరుగైన చర్యలు తీసుకుంటున్నదని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) చైర్మన్ డాక్టర్ జి.సతీశ్ రెడ్డి తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆంధ్రప్రదేశ్లోని బెజవాడ కనక దుర్గమ్మను ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం, మీడియాతో మాట్లాడుతూ, కరోనా థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు కేంద్రం అప్రమత్తతతో వ్యవహరిస్తున్నదని చెప్పారు. పీఎం కేర్ నిధులతో దేశ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కనీసం రెండు ఆక్సిజన్ ప్లాంట్లను సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.
లిక్విడ్ ఆక్సిజన్ను అందుబాటులో ఉంచేందుకు ట్యాంకర్లను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. డీఆర్డీవో ద్వారా చిన్న చిన్న సిలెండర్లను తయారుచేసి, లక్షల సంఖ్యలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చే టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించారు. కరోనా నివారణకు డీఆర్డీవో రూపొందించిన 2-డీజీ మందు ప్యాకెట్లను పలు పరిశ్రమల ద్వారా లక్షల సంఖ్యలో సిద్ధం చేసి, చిన్న చిన్న దవాఖానల్లో కూడా అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్లలో డీఆర్డీవో శాస్త్రవేత్తలు మెరుగైన సేవలు అందించారని కొనియాడారు.
సరిహద్దుల్లో మునుపెన్నడూ లేని విధంగా డ్రోన్ దాడులు జరుగుతున్న నేపథ్యంలో వాటిని పసిగట్టి, ధ్వం సం చేసే అన్ని రకాల టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నట్టు సతీశ్ రెడ్డి పేర్కొన్నారు. భారత్ ఎలక్ట్రానిక్స్, ఇతర ప్రైవే ట్ సంస్థలు కలిసి డ్రోన్ దాడులను నిర్వీర్యం చేసే టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాయని, త్వరలోనే అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఈ టెక్నాలజీని అవసరమైన సంస్థలు కంపెనీల ద్వారా పొందవచ్చునని చెప్పారు.